Hero | బాలీవుడ్లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ ధావన్ మరోసారి మంచి వ్యక్తిత్వంతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. స్టార్ హీరోలు అభిమానులతో కలిసే సందర్భాలు చాలా సాధారణమే అయినా, ఒక అభిమాని నిరాశను గుర్తించి స్వయంగా స్పందించి క్షమాపణ చెప్పడం మాత్రం అరుదుగా కనిపించే విషయం. తాజాగా వరుణ్ ధావన్ చేసిన ఇదే పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం వరుణ్ ధావన్ తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ‘హై జవాని తో ఇష్క్ హోనా హై’ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం చిత్రబృందం ఇటీవల లక్నోలో పర్యటించింది. ఈ కార్యక్రమంలో వరుణ్తో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. తమ అభిమాన హీరోను ఒక్కసారి దగ్గరగా చూడాలని అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
అభిమాని నిరాశ..
అయితే ఈ కార్యక్రమం అనంతరం ఒక మహిళా అభిమాని సోషల్ మీడియాలో తన నిరాశను వ్యక్తం చేసింది. తాము వరుణ్ను కలవడానికి దాదాపు ఐదు గంటల పాటు ఎదురు చూసామని, కానీ ఆయన కేవలం ఐదు నిమిషాల్లో కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారని ఆమె తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పేర్కొంది. ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ విషయం వరుణ్ ధావన్ దృష్టికి వెళ్లగానే ఆయన వెంటనే స్పందించారు. అదే పోస్టుకు బదులిస్తూ, “క్షమించండి.. నేను మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వలేకపోయాను. పోలీసులు మమ్మల్ని కాస్త ముందుగానే అక్కడి నుంచి పంపించేశారు” అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరో వీడియోను షేర్ చేస్తూ లక్నోలోని అభిమానులందరికీ ప్రత్యేకంగా క్షమాపణలు తెలిపారు.
నెటిజన్ల ప్రశంసలు..
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా మరింత పెద్ద వేదికపై, మెరుగైన ఏర్పాట్లతో అభిమానులను కలుసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఒక స్టార్ హీరోగా ఉండి కూడా ఓ సాధారణ అభిమాని పోస్ట్ను పట్టించుకుని, స్వయంగా స్పందించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రంలో పూజా హెగ్డే మరో కథానాయికగా నటిస్తుండగా, సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం సినిమా కంటే కూడా వరుణ్ ధావన్ చూపించిన వినయం, అభిమానుల పట్ల చూపించిన గౌరవమే సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది.
