Sai Pallavi | దక్షిణాది చిత్రాల్లో సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి సాయి పల్లవి, ఇప్పుడు హిందీ చిత్రసీమలో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఆమె కథానాయికగా నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ‘ఏక్ దిన్’ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమిర్ ఖాన్, జునైద్ ఖాన్ సమక్షంలో వేదికపై మాట్లాడిన సాయి పల్లవి, తన పదేళ్ల సినీ ప్రయాణం గురించి గుర్తుచేసుకున్నారు. ఈ ప్రయాణం నన్ను ఇంత ప్రతిభావంతుల మధ్యకు తీసుకువచ్చిందంటే ఎంతో వినమ్రంగా అనిపిస్తోంది అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తన భావాలను ఆమిర్ ఖాన్లా ధైర్యంగా బయటపెట్టలేనని, “లైట్లు ఆపేస్తే నేను మనస్ఫూర్తిగా ఏడ్చేసేదాన్ని” అని చెప్పడం అక్కడున్న వారిని కదిలించింది.
వారికి కృతజ్ఞతలు..
ఈ చిత్రంలో తనతో కలిసి నటిస్తున్న జునైద్ ఖాన్ క్రమశిక్షణను సాయి పల్లవి ప్రశంసించారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్కు కృతజ్ఞతలు తెలిపారు. గత దశాబ్దంగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన తాను, ఇప్పుడు హిందీ చిత్రసీమలో అడుగుపెడుతుండటం చాలా ఉత్సాహంగా, భావోద్వేగంగా ఉందని చెప్పారు.
‘ఏక్ దిన్’ చిత్రం 2016లో వచ్చిన థాయ్ మూవీ ‘వన్ డే’ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ ఈవెంట్లో సాయి పల్లవి కొద్దిసేపు హిందీలో మాట్లాడి ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. తన సింప్లిసిటీ, నిజాయితీతో మరోసారి అభిమానులను మెప్పించిన సాయి పల్లవి, బాలీవుడ్లో కూడా తనదైన ముద్ర వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అమీర్ ఖాన్ కన్నీళ్లు..
‘ఏక్ దిన్’ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలను వీక్షిస్తున్న సమయంలో అమీర్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతూ వాటిని టీ-షర్ట్తో తుడుచుకుంటున్న ఆయన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన పక్కనే ఉన్న సాయి పల్లవి, జునైద్ ఖాన్ ఓదారుస్తూ కనిపించారు. సినిమా అమీర్ ఖాన్ను ఎంతగా కదిలించిందో ఈ దృశ్యాలే స్పష్టంగా చెబుతున్నాయి.
