మొరాకో నుంచి స్పెయిన్ లోకి వేలాది మంది వలసలు..వైరల్ వీడియో

మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు సముద్ర మార్గం, సరిహద్దు ఫెన్సింగ్ దాటి స్పెయిన్‌లోని సెయూటాలోకి ప్రవేశించారు. ఘటనతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, సైన్యాన్ని మోహరించారు.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jul 31, 2026, 4:41 pm IST
Read Time: 6 mins
మొరాకో నుంచి స్పెయిన్ లోకి వేలాది మంది వలసలు..వైరల్ వీడియో

మెురాకో దేశం నుంచి స్పెయిన్‌ భూభాగమైన సెయూటా ద్వీపకల్ప నగరంలోకి ఒక్కరోజునే వేలాది మంది వలసదారులు చొరబడటం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మొరాకో నుంచి వేలమంది వలసదారులు సముద్రాన్ని ఈదుకుంటూ కొందరు, దొరికన బోట్ లలో మరికొందరు స్పెయిన్‌లోకి చొరబడ్డారు. ఈ ప్రయత్నంలో 20మందికి పైగా వలస ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. వలసదారులు మొరాకో నుండి స్పెయిన్‌కు చెందిన ఉత్తర ఆఫ్రికా ప్రాంతం ‘సెయుటా’లోకి విజయవంతంగా ప్రవేశించిన సందర్బంగా కేకలు వేస్తూ కేరింతలు కొడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. నిన్న మొరాకో నుండి స్పెయిన్‌లోకి దాదాపు 80,000 మంది వలసదారులు ప్రవేశించినట్లు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా క గంటకు 12,000 మంది చొప్పున వలసదారులు వచ్చారని తెలుస్తుంది. అక్రమ వలసదారులు అదుపు తప్పి ప్రవర్తిస్తూ వాహనాలను దగ్ధం చేయడం, షాపులపై ఆహారం కోసం దాడులకు దిగడంతో సెయూటా నగరంలో అసాధారణ పరిస్థితులు కన్పించాయి.

స్పెయిన్ సరిహద్దుల్లో కట్టడికి సైన్యం మోహరింపు

స్పెయిన్ భూభాగంలోని టారాహల్‌ సరిహద్దు వద్ద వలసదారులను అదుపు చేయలేక స్థానిక అధికారులు చేతులెత్తేశారు. వెంటనే జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలని, సరిహద్దుల్లో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సైన్యాన్ని పంపాలని స్పెయిన్‌ ప్రభుత్వాన్ని సెయిటా అధికారులు కోరారు. అయితే ఆత్యయిక స్థితి విధింపునకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది.

సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉన్నప్పటికీ.. మొరాకో నుంచి వలసదారులు ఫెన్సింగ్‌ ఎక్కి స్పెయిన్‌లోకి ప్రవేశించడం సాధారణంగా కొనసాతుంటుంది. అయితే ఈసారి చాలా మంది సముద్రాన్ని ఈదుకుంటూ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కల్గించింది. ఈ సముద్ర మార్గం తక్కువ దూరమే అయినప్పటికీ..బలమైన అలలు, సరిహద్దు బ్యారియర్లను దాటుకుని వచ్చే క్రమంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అధికారులు వెల్లడించారు.

ఇప్పుడే ఎందుకీ భారీ వలసలు..?

ఈశాన్య ఆఫ్రికాలోని సెయూటా ద్వీపకల్పం స్పెయిన్ ఆధీనంలో ఉంది. మొరాకో తో సరిహద్దు నగరంగా కొనసాగుతుంది. జిబ్రాల్టర్‌ జలసంధికి సమీపంలో ఉంటుంది. ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమాఖ్యకు ఉన్న ఏకైక భూ సరిహద్దు ఇదే కావడంతో ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు సెయిటా నగరాన్ని ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఒక్కసారిగా వేలమంది వలసదారులు స్పెయిన్‌లో ప్రవేశించడానికి కారణాలేంటనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జులై 30న వేలాది మంది ఖైదీలకు రాజు క్షమాభిక్షలు ప్రసాదించారు. ఇలా మానవతా దృక్ఫథంతో విడుదలైన వారే సరిహద్దులు దాటి స్పెయిన్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ వలసదారులను మొరాకో అధికారులే వాహనాల్లో తీసుకొచ్చి సరిహద్దుల్లో వదిలేసినట్లు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజా వలసల నేపథ్యంలో మొరాకో – స్పెయిన్ ల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.