Ram Charan | ‘పెద్ది’ ఈవెంట్‌లో రామ్ చరణ్ చేతికి కట్టు.. గాయం ఇంకా తగ్గలేదా, ఫ్యాన్స్ ఆందోళన!

Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్ భారీ విజయాన్ని సాధించగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మెగా ఈవెంట్ అభిమానుల సందోహంతో కళకళలాడింది.

Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్ భారీ విజయాన్ని సాధించగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మెగా ఈవెంట్ అభిమానుల సందోహంతో కళకళలాడింది. ఉత్తర భారతంలో తెలుగు సినిమా ప్రమోషన్స్‌కు లభిస్తున్న స్పందన చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఈ వేడుకలో రామ్ చరణ్‌ను చూసిన అభిమానుల దృష్టిని ఒక విషయం ప్రత్యేకంగా ఆకర్షించింది. గత వారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో చేతికి సపోర్టింగ్ ప్లాస్టర్‌తో కనిపించిన చరణ్, ఇప్పుడు భోపాల్ ఈవెంట్‌లో కూడా అదే కట్టుతో కనిపించారు. దీంతో ఆయన చేతి గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

కాస్త ఊర‌ట‌..

అయినా గాయం ఉన్నప్పటికీ చరణ్ మాత్రం తనలో ఎలాంటి అసౌకర్యం కనిపించనీయకుండా ఎంతో ఉత్సాహంగా వేదికపై కనిపించారు. చేతిని సులభంగా కదుపుతూ అభిమానులతో ముచ్చటించడం, ఈవెంట్‌లో చురుగ్గా పాల్గొనడం చూసి అభిమానులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.

ఈ గాయానికి సంబంధించిన అసలు కారణాన్ని రామ్ చరణ్ గతంలోనే వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో నిజమైన పహిల్వాన్లతో కుస్తీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ గాయం జరిగిందని చెప్పారు. “ఇది దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన అందమైన కానుక” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

మ‌ణిక‌ట్టుకి గాయం..

సాధారణంగా సినిమాల్లో ఫైట్ సీన్ల కోసం ట్రెయిన్ అయిన స్టంట్ ఆర్టిస్టులను ఉపయోగిస్తారు. అయితే ‘పెద్ది’లో సహజత్వం కోసం దర్శకుడు బుచ్చిబాబు నిజమైన పహిల్వాన్లను రంగంలోకి దించారు. షూటింగ్ సమయంలో కుస్తీ సన్నివేశాల్లో భాగంగా జరిగిన పోరాటంలో చరణ్ చేతి మణికట్టుకు గాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన భారీ కుస్తీ షెడ్యూల్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే భోపాల్ ఈవెంట్‌కు రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, నిర్మాతలు, టెక్నీషియన్లు, సహ నటీనటులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మ్యూజిక‌ల్ షో అదుర్స్..

సాధారణంగా మెలోడీ పాటలతో గుర్తింపు పొందిన రెహమాన్, ఈసారి మాత్రం ‘పెద్ది’ చిత్రంలోని మాస్ బీట్‌లతో స్టేజ్‌పై అదిరిపోయే ఎనర్జీని చూపించారు. భారీ సంఖ్యలో వచ్చిన యువత, అభిమానులు ఆ సంగీతానికి ఉర్రూతలూగిపోయారు. స్టేజ్ ముందు కూర్చున్న రామ్ చరణ్ కూడా తన గాయాన్ని మర్చిపోయి ఆ మ్యూజికల్ షోను ఆస్వాదించడం అభిమానులను ఆకట్టుకుంది.

మొత్తానికి ‘పెద్ది’ ప్రమోషన్స్‌కు దేశవ్యాప్తంగా లభిస్తున్న స్పందన, రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

Latest News