Health tips : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే పోషక లోపం సంబంధ రుత్మతలు తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే విటమిన్ బి12 లోపం మాటున హానికర రక్తహీనత దాగి ఉంటుంది.
Health tips : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే పోషక లోపం సంబంధ రుత్మతలు తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే విటమిన్ బి12 లోపం మాటున హానికర రక్తహీనత దాగి ఉంటుంది. బి12 లోపంవల్ల మొదట్లో కొద్దిగా మైకం కమ్మినట్లుగా, మగతగా ఉంటుంది. తేలిగ్గా తీసుకుంటే క్రమంగా అతిసారం, గ్లోసిటిస్ (స్మూత్ టంగ్) లాంటి సమస్యల బారినపడాల్సి వస్తుంది. వ్యాధి మరింత ముదిరితే నాడీ సంబంధ సమస్యలు వస్తాయి.
క్రమంగా బాబిన్స్కీ రిఫ్లెక్స్ సంభవిస్తుంది. అంటే అరికాలుపై కొట్టినప్పుడు పాదానికి ఉన్న మిగిలిన అన్నివేళ్లు కిందికి వంగుతుంటే బొటనవేలు మాత్రం పైకి లేస్తుంది. అయితే రెండేండ్ల లోపు పిల్లలలో ఈ రిఫ్లెక్షన్ సాధారణమేనని నేషనల్ లైబ్రెరీ ఆఫ్ మెడిసిన్ నిపుణులు తెలిపారు. కానీ, పెద్దవారిలో ఈ రిఫ్లెక్షన్ కనిపిస్తే అది కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మతకు సంకేతమని చెప్పారు. అంటే అప్పుడప్పుడు అరికాళ్లపై తట్టి చూసుకోవడం ద్వారా విటమిన్ బి12 స్థాయిలు బాగా పడిపోయిన విషయాన్ని అంచనా వేయవచ్చన్నమాట.
సాధారణంగా విటమిన్ బి12 శోషణకు జీర్ణాశయ గోడల్లోని పార్శ్వకణాల నుంచి స్రవించబడే అంతర్గత కారకం అవసరం. హానికర రక్తహీనతతో బాధపడుతున్న వారిలో విటమిన్ బి12ను శోషించుకునే అంతర్గత కారకం లోపిస్తుంది. ఎందుకంటే ఈ హానికర రక్తహీనత అనేది జీర్ణాశయ క్షీణతతో సంబంధం కలిగి ఉంటుంది. జీర్ణాశయ గోడల్లోని పార్శ్వ కణాలు పూర్తిగా లేదా పాక్షికంగా లోపించడం జీర్ణాశయ క్షీణతకు దారితీస్తుంది.
40 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు వారి నుంచి 15 శాతం మందిలో, వృద్ధులైన పేషెంట్లలో 20 నుంచి 30 శాతం మందిలో ఈ జీర్ణాశయ క్షీణత కనిపిస్తుంది. అరవై ఏండ్లకు అటుఇటు వయసు ఉన్నవాళ్లలో సాధారణంగా ఈ జీర్ణాశయ క్షీణత సంభవిస్తుంది. అదేవిధంగా నీలం రంగు కళ్లు, ఎ బ్లడ్ గ్రూప్ ఉన్న పేషెంట్లకు జీర్ణాశయ క్షీణత రావచ్చు. వంశపారంపర్యంగా కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉన్నది.
– తీవ్రమైన కేసులలో కొందరు పేషెంట్లలో గుండె వైఫల్యం, కాలేయవాపు లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి కేసులలో మానసిక మార్పులు సంభవిస్తాయి. అంటే ఒత్తిడి, మతిస్థిమితం కోల్పోవడం, మృత్యుభయం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ బి12 స్థాయిలు 150ng/l కంటే తక్కువగా ఉంటే దాన్ని లోపంగా చెప్పవచ్చు. రక్త పరీక్షల ద్వారా ఈ విటమిన్ బి12 స్థాయిలను అంచనా వేయవచ్చు. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు, ఎర్ర రక్తకణాల పరిమాణం, విటమిన్ బి12 స్థాయిలు, ఫోలేట్ స్థాయిలు రక్తపరీక్షల్లో తేలుతాయి.
హానికర రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడానికి మరికొన్ని రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ హానికర రక్తహీనత పరీక్షలు అక్కర్లేదు. రోగి కండిషన్ను బట్టి ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రోగిలో హానికర రక్తహీనత ఉన్నట్లు తేలితే హైడ్రాక్సోకోబాలమిన్ ఇంజక్షన్ల ద్వారా చికిత్స చేస్తారు. హైడ్రాక్సోకోబాలమిన్ అనేది విటమిన్ బి12కు సింథటిక్ వెర్షన్. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చికిత్స జీవితాంతం కొనసాగుతుంది. ట్రీట్మెంట్ సరిగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మరికొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి.