ఈ వ్యవహారంపై మా పోరాటం ఫలించింది పేపర్ లీకేజీపై కిషన్రెడ్డి, సంజయ్ అమిత్ షాకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మోడీ, అమిత్ షాల సహకారంతోనే అదానీ ప్రజాధనం లూటీ రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా రేపటి నుంచి పోస్టుకార్డు ఉద్యమం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీగ లాగితే లింక్ ప్రగతి భవన్ లో తేలిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలనం ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పై విచారణ ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి బావమరిది […]
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీగ లాగితే లింక్ ప్రగతి భవన్ లో తేలిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలనం ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పై విచారణ ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి బావమరిది రాజశేఖర్ రెడ్డి సీఎంవోలో పని చేస్తున్నారు. కేసీఆర్ కు రాజశేఖర్ రెడ్డికి ఉన్న అనుబంధం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ అన్నారు.
పేపర్ లీకేజీ వ్యవహారంపై టీ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంలో మా పోరాటం, ఒత్తిడి ఫలించాయన్నారు. పూర్తి స్థాయిలో పోరాట కార్యాచరణతో ముందుకెళతామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవహారాన్నివదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందే నని డిమాండ్ ను మరోసారి పునరుద్ఘాటించారు. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే టీఎస్పీఎస్సీ పాలకమండలిని రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టాలన్నారు. ఇప్పుడున్న కమిటీపై తెలంగాణ ప్రజలకు విశ్వసనీయత లేదని తెలిపారు. కొత్త కమిటీ ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఏప్రిల్ 25న సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో భారీ నిరుద్యోగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10న జుక్కల్ నుంచి హాత్ సే హాత్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.
ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి అదానీకి ప్రజాధనం దోచిపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2014లో 20వేల కోట్లు ఉన్న అదానీ 2023 జనవరి 15 నాటికి 13 లక్షల కోట్లకు ఎగబాకారు. వారిద్దరి సహకారంతోనే అదానీ ప్రజా ధనాన్ని లూఠీ చేశారు. దానివల్లే అదానీ సంపద పెరిగిందని ఆరోపించారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతరు సంస్థలను అదానీ మోసం చేశారు. కృత్రిమంగా షేర్ల విలువ పెంచి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టారని ఆరోపించారు. అవినీతి చేయడం వల్ల అదానీకి చెందిన రూ.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయని తెలిపారు. ఈ విషయాలన్నీ పార్లమెంట్లో మాట్లాడితే అన్ని బయటకు వస్తాయనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.
ప్రధాని మోడీ, అమిత్ షా రాహుల్ గాంధీపై కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చాడన్నారు. రాహుల్ ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేయించి ఆయనపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని ధ్వజమెత్తారు. నడిబజార్లో నిలబెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూశారని మోదీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా రేపు (ఏప్రిల్ 3 నుంచి) పోస్టు కార్డు ఉద్యమం చేపడతాం. రాహుల్ పై అనర్హత వేటు, టీఎస్ పీఎస్ సీ పేపర్లీక్ పై జనంలోకి వెళ్తామన్నారు. ఈ నెల 8న మంచిర్యాలలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో వచ్చినట్లేనని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతుగా నిలవాలని గద్దర్ ను కోరామన్నారు. భవిష్యత్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దర్ గళం వినిపిస్తారు. రాహుల్ గాంధీ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనాలని గద్దర్ ను ప్రత్యేకంగా కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 7న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంజాన్ నేపథ్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. షర్మిలతో కలిసి వెళ్లవద్దని మా కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ కాకుండా మేం చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా అభ్యంతరం లేదన్నారు. బీజేపీ నేతలు పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలు వేయవద్దన్నారు. పేపర్ లీక్ పై అమిత్ షా కు ఎందుకు పిర్యాదు చేయలేదు? అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ప్రశ్నించారు. ఈ అంశంపై గవర్నర్ కు కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయలేదు? అని అడిగారు.