Dr D Nageshwar Reddy : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అరుదైన పురస్కారం

ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుండి 2025 అంబుజ్ నాథ్ బోస్ బహుమతి దక్కింది. ఈ గౌరవం అందుకున్న రెండవ భారతీయుడు ఈయనే.

Dr D Nageshwar Reddy : డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అరుదైన పురస్కారం

విధాత, హైదరాబాద్ : ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలాజిస్టు డాక్డర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి మరో అరుదైన పురస్కారం దక్కింది. ఎండోస్కోపీలో తన మార్గదర్శకమైన కృషికి లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుండి 2025 అంబుజ్ నాథ్ బోస్ బహుమతిని గెలుచుకున్నారు. 1998 నుండి ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడిగా నాగేశ్వర్ రెడ్డి నిలిచారు.

అవార్డుల బంధు..నాగేశ్వర్ రెడ్డి

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి గ్యాస్ట్రో ఎంటరాలాజీ, ఎండోస్కోపీ వైద్య పరీక్షల విభాగంలో అందించిన సేవలకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అందులో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు పద్మశ్రీ(2002), పద్మభూషణ్(2016), పద్మవిభూషణ్(2025)లను దక్కించుకున్నారు. మూడు పద్మ పురస్కారాలు అందుకున్న తొలి భారతీయ వైద్యుడిగా రికార్డులకెక్కారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూఈవో) ప్రతిష్ఠాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు) అందుకున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు కావడం నాగేశ్వర్ రెడ్డి కావడం గమనార్హం. ఎండోస్కోపీ రంగంలో ప్రపంచ అత్యధిక గౌరవ పురస్కారంగా, వైద్య పరిభాషలో ఎండోస్కోపీకి సంబంంధించి నోబెల్‌ బహుమతిగా అభివర్ణించే ‘మాస్టర్‌ ఆఫ్‌ ఎండోస్కోపిస్ట్‌’ అవార్డును 2009లో అందుకున్నారు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ ఈ అవార్డును అందజేసింది. 2013లో ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడిగా నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇక 2022లో ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ (ఏజీఏ) అందించే విశిష్ట విద్యావేత్త పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. వరల్డ్‌ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు ప్రెసిడెంట్‌గా బాద్యతలు చేపట్టిన మొదటి భారతీయుడిగానూ రికార్డు సాధించారు. నాగేశ్వర్‌రెడ్డి హైదరాబాద్ లో ప్రారంభించిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి, ఇప్పుడు గ్యాస్ట్రో ఎంటరాలజీ పరంగా హార్వర్డ్‌, హాంకాంగ్‌లోని ఆస్పత్రుల తర్వాత మూడో స్థానంలో ఉంది. ఎండోస్కోపీ చికిత్సల్లో అత్యాధునిక సాంకేతిక వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత నాగేశ్వర్ రెడ్డికే దక్కింది. భారత్‌, జపాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏఐ బేస్డ్‌ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలను ఆయన అందుబాటులోకి తేవడం ద్వారా జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో విశేష సేవలందించారు.