హైదరాబాద్ లో మళ్లీ రియల్ బూమ్ ఊపందుకుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) భూముల వేలంలో సరికొత్త రికార్డు ధరలు నమోదయ్యాయి. రంగారెడ్డి శేరిలింగపల్లి మండలంలోని రాయదుర్గం పాన్ మక్తాలో సర్వే నంబర్.83/1లో 6ఎకరాల 29 గుంటలకు వేలం నిర్వహించగా..ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధర పలికింది. వేలంలో ఈ భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుంది. గత ఎడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ. 177 కోట్లు మాత్రమే పలకడం గమనార్హం. అపుడు 7 ఎకరాల మొత్తం రూ. 1357 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇప్పుడు నిర్వహించిన తాజా వేలంలో మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్ దక్కించుకుంది. గతేడాది ఎకరం రూ. 177 కోట్లకు ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకోగా, ఈసారి గౌర వెంచర్స్ ఎకరం భూమిని రూ. 237 కోట్లకు దక్కించుకుంది. ఇక్కడేజూన్ 1వ తేదీన మరో 5.09 ఎకరాలకు టీజీఐఐసీ వేలం వేయనుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ లో ఎయిర్ పోర్టుకు సమీపంలోని రావిర్యా ల లో భూములను కొనుగోలు చేయడానికి అనేక మంది పోటీపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం నాడు ఇ-ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు భూమలకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం భూమి గరిష్టంగా రూ.83,500 కు అమ్ముడు పోయిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ. 140 కోట్లఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
ఈ భూములను ఇ-ఆక్షన్ లో వేలం పాట ద్వారా విక్రయిస్తున్నట్లు గత నెలలో హోసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీ పడ్డారు. రూ.26 వేల కనీసధరను నిర్ధారించగా, దీనిని దక్కించుకోడానికి పోటీ పడుతూ చదరపు గజం రూ.83,500 కు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. అలాగే ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలం పాటలో చదరపు గజం రూ.62,500 ధరకు అమ్ముడు పోయింది. అంతే కాకుండా సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడ్డారు. ఈ నాలుగు భూముల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 140 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
నేడు కూడా భూముల విక్రయాలు
కెపిహెచ్ బి కాలనీ, కుత్భుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ప్లాట్లకు (భూములకు) శుక్రవారం నాడు ఇ-ఆక్షన్ నిర్హహిస్తున్నారు. కెపిహెచ్ బి కాలనీ ఫేజ్ 1-2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నెం 2, కుత్బుల్లాపూర్ చింతల్ లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.
