విధాత: ప్రకృతిపై మానవుడి చూపిస్తున్న ఆధిపత్యం వివిధ జీవుల, వృక్షాల మనుగడను ప్రమాదంలో పడేస్తోంది. ఇప్పటికే అంతరించిపోయిన పలు జీవుల వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో మానవుని చర్యలు కారణంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఉభయచరాలు (Amphibians) అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
ఉభయచరాలు మనం అనుకున్నదాని కంటే వేగంగా అంతరించిపోతున్నాయి. వాటితో మనకేంటి ఉపయోగం అనుకోవచ్చు. కానీ ఆ జాబితా పెద్దదే. వైద్య పరంగానే కాకుండా క్రిమికీటకాలను భక్షిస్తూ కప్పలు, పీతలు లాంటివి మన పొలాలను కాపాడతాయి. ప్రకృతి గొలుసులో భాగమై ఈ భూగోళాన్నిమరింత అందంగా ఉంచడంలో సాయపడతాయి.
అంతే కాకుండా వీటి ఉనికి లేకపోతే మలేరియా వంటి అంటు వ్యాధులు విపరీతంగా ప్రబలుతాయి. కప్పలు దోమ లార్వాలను తినేయడం ద్వారా వాటి సంతతిని అదుపులో ఉంచుతాయని తెలిసిందే అని రి వైల్డ్ సంస్థకు చెందిన పర్యావరణ వేత్త కెల్సే నీం వెల్లడించారు. 2004 వరకు కూడా ఈ జీవులు అంతరించిపోవడానికి వ్యాధులు, అటవీ ప్రాంతం తరిగిపోవడమే కారణాలని శాస్త్రవేత్తలు భావించారు.
తాజాగా ఈ రెండు కారణాల కంటే పర్యావరణ మార్పులే వాటి పాలిట శాపంగా మారాయని కనుగొన్నారు. ఏకంగా వీటి క్షీణతలో 39 శాతం పర్యావరణ మార్పుల వల్లే సంభవించిందని సైన్స్ అలెర్ట్ నివేదిక ప్రస్తావించింది. దీని తర్వాత అడవులు, చిన్న చిన్న చెట్లు కొట్టేయడం వల్ల కప్పలు మొదలైన వాటికి ఆవాసం కొరవడుతోంది. ఈ కారణాల 37 శాతం క్షీణత నమోదవుతోంది.
ఒకవేళ ఇవే కనుక భూమిపై కనుమరుగైతే ఆ ప్రభావం ప్రకృతిపై విపరీతంగా ఉంటుందని ఈ నివేదిక హెచ్చరించింది. 2004 లెక్కల ప్రకారం 8011 ఉభయచర జాతులు అంతరించిపోయే జీవుల జాబితాలో ఉండగా.. ఇప్పటి వరకు వాటి సంఖ్యపై పరిశోధన జరగలేదు. పరిస్థితి వేగంగా మారిపోతోందని.. ఆ 8011 జాతులపై తక్షణం సర్వే జరగాల్సి ఉందని రీ వైల్డ్ సంస్థ అభిప్రాయపడింది.