Gaza-Israel Ceasefire | ముగిసిన గాజా-ఇజ్రాయెల్ యుద్ధం.. అమల్లోకి కాల్పుల విరమణ
రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంతో తెరపడింది. శుక్రవారం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

న్యూఢిల్లీ : రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్-హమాస్ గురువారం సంతకాలు చేయడంతో యుద్దానికి తెరపడింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. గాజా నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఇరు పక్షాలు బందీలను విడుదల చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించాయి.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడికి దిగింది. దాదాపు 1,200 మందిని హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 67,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంో యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. ఈ మేరకు గాజాలో శాంతికి 20 సూత్రాల శాంతి ప్రణాళికను సూచించారు. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్-హమాస్ అంగీకరించడంతో యుద్దానికి తెరపడనట్లయ్యింది.