ICJ : అంతర్జాతీయ న్యాయస్థానం (International Court of Justice – ICJ) మొట్టికాయలు వేసినా ఇజ్రాయెల్ (Israel) తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దక్షిణ గాజాలోని రఫాపై (Rafah) సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలన్న ఐసీజే ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. శనివారం కూడా రఫా నగరంపై తుపాకులతో విరుచుకుపడింది. హమాస్ (Hamas) ఉగ్రవాదుల ఏరివేత పేరుచెప్పి సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్పై శుక్రవారం 15 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సైనిక చర్యను వెంటనే ఆపేయాలని ఐసీజే తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. అంతేకాకుండా గాజాకు మానవతాసాయం అందేలా రఫా క్రాసింగ్ను తెరవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) దర్యాప్తు సంస్థలను, నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని ఆర్డర్ వేసింది.
నెల రోజులలోగా తమ ఆదేశాల అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని తెలిపింది. అయితే వాటన్నింటినీ ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతూ యధావిధిగా దాడులు కొనసాగిస్తోంది. ఐసీజే ఆదేశాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, వాటిని అమలుచేసే యంత్రాంగాలు మాత్రం లేవు. దాంతో ప్రపంచ న్యాయస్థానం ఆదేశాలు ఇజ్రాయెల్పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాయి.
అంతేగాక తమ పౌరుల రక్షణ కోసం దాడులు చేయడం తప్పు కాదని, ఈ విషయంలో ఐసీజే అభిప్రాయం సరికాదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. పాలస్తీనా పౌరులను ఇబ్బంది పెట్టేందుకుగానీ, వారి జీవన పరిస్థితులను చిన్నాభిన్నం చేసేందుకుగానీ తాము సైనికచర్య చేపట్టలేదని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హనెబ్గీ చెప్పారు. ఇదిలావుంటే ఇజ్రాయెల్ – హమాస్ సయోధ్య కుదిర్చేందుకు ఫ్రాన్స్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.