విధాత,: హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా విధించిన డెడ్ లైన్ సమయం మరికొన్ని గంటల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాతో సహా నా దేశప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని, ఏదేమైనా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్న పెజెష్కియాన్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
మరికొన్ని గంటల్లో ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశంలోని అనేక స్థావరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సారి ఎటువంటి డెడ్లైన్ పొడిగింపులు ఉండబోవని తేల్చిచెప్పారు. ఇరాన్ను తమ బలగాలు ఒక్కరాత్రిలో తుడిచి పెట్టేయగలవని.. ఆ రాత్రి మంగళవారం రాత్రే కావచ్చని హెచ్చరించారు. ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) ముగియనుంది.
అయితే ట్రంప్ బెదిరింపులకు బెదరని ఇరాన్ ఇప్పటికి అమెరికా ప్రతిపాదనలకు, తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని స్పష్టం చేయడం విశేషం. దీంతో యుద్ద పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఆందోళన పశ్చిమాసియా దేశాల్లో వ్యక్తమవుతుంది.
ఇవి కూడా చదవండి :
కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత
హర్ముజ్ తెరవండి: ట్రంప్ హుకుం – తాళంచెవులు పోయాయి : ఇరాన్ వ్యంగ్యం
