World War 3 | ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధంలోకి ఇరాన్ – టెల్అవీవ్పైకి క్షిపణులు
కొద్దిసేపటి క్రితం ఇరాన్, ఇజ్రాయెల్పై నేరుగా క్షిపణి దాడి చేసింది. దీంతో ఇరుదేశాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్లే. దీంతో మధ్యప్రాచ్యమంతా యుద్ధభయంలో మునిగిపోయింది.

ఊహించినట్లే కొద్ది సేపటి క్రితం ఇరాన్(Iran) ఇజ్రాయెల్(Israel)పై నేరుగా దాడికి దిగింది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటల 8 నిమిషాల(10.08 pm IST)కు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్(Tel Aviv)పై క్షిపణులతో దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సూచించింది. టెల్అవీవ్లో నిరంతరాయంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఉన్న బాంబ్ షెల్టర్ల(Bomb Shelters)లోకి వెళ్లాల్సిందిగా సత్వర ఆదేశాలు జారీ చేసింది.
బీరూట్లోని భూగర్భ రహస్య స్థావరంలో చర్చలు జరుపుతున్న హెజ్బుల్లా(Hezbullah) అధినేత హసన్ నస్రల్లా(Hassan Nasrallah)పై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బంకర్ బస్టర్ బాంబులు కురిపించి హతమార్చింది. ఈ ఘటనలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(IRG)కు చెందిన అత్యున్నత అధికారి ఒకరు కూడా మృతి చెందినట్లు సమాచారం. దీంతో తమ సుప్రీం ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని హుటాహుటిన రహస్య ప్రదేశానికి తరలించిన ఇరాన్ యుద్ధ ప్రకటనలు చేస్తూనేఉంది. ఇజ్రాయెల్ లెబనాన్(Lebanon)లోని హెజ్బుల్ స్థావరాలపై భూతల దాడులు ప్రారంభించిన వేళ, ఇరాన్ కాసేపటి క్రితం ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించింది.
ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ, ఐడిఎఫ్(IDF)ను ఉటంకిస్తూ, ఈ రాత్రి 10.08 ని.లకు ఇరాన్ తమపై క్షిపణి దాడి చేసిందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికార వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ(IRNA) కూడా ధృవీకరించింది. తాము టెల్ అవీవ్పై దాడి చేసినట్లు ప్రకటించింది. రాయటర్స్ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం దాదాపు 100 క్షిపణులను ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ దాడిని గుర్తించిన వెంటనే ఇజ్రాయెల్ తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, బాంబ్ షెల్టర్లకు తరలించాల్సిందిగా ఆదేశించింది. ఇవే ఆదేశాలను ఇజ్రాయెల్ ప్రభుత్వ శాఖలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్ చేసాయి.
అంతకుముందే, టెల్ అవీవ్లో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడగా, నలుగురు ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దుండగులిరువురిని పోలీసులు కాల్చిచంపారు.
Tags: