HYDRA । హైడ్రా అంటే హడలెత్తుతున్న హైదరాబాదీలు

గత కొంత కాలంగా నగరంలో విక్రయాలు పడిపోయాయని, హైడ్రాతో పాత అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయని చెపుతున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ల రాబడి కూడా తగ్గిందని తెలుస్తోంది.

HYDRA । హైడ్రా అంటే హడలెత్తుతున్న హైదరాబాదీలు
  • అమ్మేవాళ్లే కానీ కొనేవాడు లేడు
  • హైడ్రా ఎన్వోసీ ఉంటేనే రుణాలిస్తామంటున్న బ్యాంకులు
  • భూ యజమానులు బిల్డర్లకు ఇచ్చారు.. బిల్డర్లు అమ్ముకున్నారు
  • నివాసం ఉంటున్నది మధ్యతరగతి వేతన జీవులే
  • కూల్చివేతలతో నష్టపోతున్నది సామాన్యులే
  • ముంబాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరుగులు

HYDRA । హైడ్రా.. ఆ పేరు చెపితే హైదరాబాద్ వాసులు హడలెత్తుతున్నారు. 70 ఏళ్లుగా వ్యవ‌స్థీకృతంగా జరిగిన చెరువుల ఆక్రమణలపై (encroachment of the ponds) ఒకేసారి ఆపరేషన్ మొదలు పెట్టడంతో నగర జీవులు అల్లాడిపోతున్నారు. వాస్తవంగా హైదరాబాద్‌లో చెరువులు, నాలాలను చెరబట్టటంతోనే చిన్న వర్షానికే భారీ వదరలు వస్తున్నాయి. కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నగరం నడిమధ్యలో హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న దుర్గం చెరువు (Durgam Lake) ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే అనేక బహుళ అంతస్థుల భవనాలు (multi-storied buildings), పలు కాలనీలు వెలిశాయి. హైదరాబాద్ జంటనగరాల ప్రజల దాహార్తి తీరుస్తున్న గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్లలోనే (buffer zones) అక్రమ నిర్మాణాలు పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చాయంటేనే కబ్జాదారులు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎలా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. సంఘంలో పెద్దమనుషులుగా చెలామణి అయ్యేవారు, ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఉన్న కొంత మంది ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

 

విధ్వంసం ఈనాటిది కాదు..

వ్యవ‌స్థీకృతంగా జరిగిన చెరువుల ఆక్రమణలు, విధ్వంసం  (Systematic encroachment) ఈనాటిది కాదు. దాదాపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ఏర్పాటు అయినప్పటి నుంచీ మొదలైంది. రానురాను ఈ ఆక్రమణల పర్వం పరాకాష్టకు చేరింది. వింతల్లోకెల్లా వింత ఏమిటంటే.. సింగరేణి ఉద్యోగుల (Singareni Employees) సొసైటీకి ఇండ్లు కట్టుకోవడానికి సరూర్ నగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలమే సరూర్ నగర్ (Sarur Nagar) చెరువులో ఉంది. ఇందులో ఇండ్లు నిర్మించుకోవడానికి జీహెచ్ఎంసీ (GHMC) అనుమతులు ఇచ్చింది. ఇందులో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇండ్ల నిర్మాణం జరిగింది. దాదాపు 20 ఏళ్లుగా సింగరేణి ఉద్యోగులు అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం సరూర్‌నగర్‌ ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో ఉన్నదని ఇప్పటికి గానీ ప్రభుత్వానికి స్పృహరాలేదు. ఇలా అనేకచోట్ల చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో జరిగిన నిర్మాణాలకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు నిర్మాణ అనుమతులు ఇవ్వడం గమనార్హం. నిర్మాణ అనుమతులు రావడంతో బిల్డర్లు నిర్మించారు. బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఉద్యోగులు, వ్యాపారస్థులు, ఇతర వేతన జీవులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అపార్ట్ మెంట్లు (apartments), ఇండ్లు కొనుక్కొని వాటిల్లో నివాసం ఉంటున్నారు. తాజాగా హైడ్రా వచ్చి ఈ భవనాలన్నీ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చి వేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సరికి భవనాలు కూలిపోయి, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. దీంతో తాము బ్యాంకు రుణాలు తీసుకొని కొన్నామని, అన్ని అనుమతులు ఉన్నాయని చూసుకొని కొనుక్కున్నామని చెపితే వినే నాథుడే లేకుండా పోయాడని బాధితులు వాపోతున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా.. డోంట్ కేర్ అన్నట్టుగా హైడ్రా (HYDRA) తీరు ఉన్నది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేసినా వెరవకుండా కూల్చివేతలు చేస్తున్నారు. తాజాగా అమీన్‌పూర్‌లో (Aminpur) కూల్చివేతలు మొదలు పెట్టగానే అక్కడి మున్సిపల్ చైర్మన్ వచ్చిఅడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపలేదు. ఇప్పటి వరకు 180కి పైగా నిర్మాణాలు కూల్చి వేశారని అంటున్నారు. ఇందులో గండిపేట జలాశయం అతి సమీపంలో ఉన్న 48 నిర్మాణాలను డిమాలిష్ చేసింది. ఈ పరిస్థితి ఎలా ఉందంటే… భూ యజమాని పట్టా భూమి కాబట్టి తన భూమిని డెవలప్‌మెంట్‌ నిమిత్తం బిల్డర్‌కు ఇచ్చాడు. అన్ని పత్రాలు చూసుకొనే అంతా సరిగ్గా ఉందని నిర్థారించుకున్న తరువాతనే అగ్రిమెంట్ చేసుకొని డెవలప్ చేశానని బిల్డర్ చెపుతున్నాడు. అన్ని అనుమతులు చూసుకున్నాకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కొనుక్కున్నామని ఇంటి యజమాని చెపుతున్నాడు. ఇక్కడ తప్పెవరిది? భూ యజమానిదా? లేక బిల్డర్‌దా? లేదా ఎఫ్‌టీఎల్‌ అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చినా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలదా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? కానీ చివరకు భూ యజమాని, బిల్డర్, అనుమతులు ఇచ్చిన అధికారులు అంతా బాగానే ఉన్నారు. అప్పు చేసి కొనుగోలు చేసిన ఇంటి యజమాని తీవ్రంగా నష్టపోయాడని సగటు హైదరాబాద్ వాసి అంటున్నాడు.

 

పద్ధతి ప్రకారం చేయండి..

రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఆక్రమణలు తొలగించండి కానీ.. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి కదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వ్యవ‌స్థీకృతంగా జరిగిన చెరువుల ఆక్రమణలో కీలక భూమిక భూ యజమానులు, భవన నిర్మాణదారులు, వారికి అనుమతులు ఇచ్చిన నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులదేనని బాధితులు అంటున్నారు. తాము అన్ని అనుమతులు చూసే కొనుక్కున్నామని, ఇప్పుడు కూల్చివేస్తే తమకు జరిగిన నష్టం పూడ్చేది ఎవరని అడుగుతున్నారు. మహానగరంలో ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పుడో లెక్క అన్న తీరుగా ఉన్నది. ఇప్పటి వరకు నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేక్ వ్యూ అపార్ట్ మెంట్లు (Lake View Apartments) అని, లేక్ వ్యూ విల్లాలు అని మార్కెటింగ్ చేశాయి. అలా లేక్ వ్యూ ఉన్న భవనాలలో ఫ్లాట్ల విక్రయాలకు అదనపు ధరలు నిర్ణయించి విక్రయించే వారు. అయితే హైడ్రా ఏర్పాటు తరువాత జరుగుతున్న కూల్చివేతలతో లేక్ వ్యూ ఫ్లాట్లు, విల్లాలు అంటేనే అమ్మో మాకొద్దు అంటున్నారు. నిర్మాణ సంస్థలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు సైతం తమ డబ్బులను వెనక్కు తీసుకుంటున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు లేక్ వ్యూ పేరు చెప్పడానికే భయపడుతున్నాయి. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు జంకుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులు ఉంటే సరిపోవని, హైడ్రా ఎన్వోసీ ఉన్నదా? అని బ్యాంకులు మెలిక పెడుతున్నాయని రాజేందర్ అనే నగర వాసి తెలిపాడు. మరి హైడ్రా ఎన్వోసీ ఇస్తుందా? హైడ్రా చట్టబద్ధమైన సంస్థేనా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటుకు ఇప్పటి వరకు చట్టబద్ధత లేదని, అలాంటి సంస్థ ఎన్వోసీ ఉంటేనే రుణాలు ఇస్తామని బ్యాంకులు అంటున్నాయంటే చట్టబద్ధ సంస్థలపై ఉన్న నమ్మకాన్ని హైడ్రా వమ్ము చేసిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ నేతలతో తమకెందుకు గొడవ అనుకుంటున్నారో ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భవన నిర్మాణ దారులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారని ఈ రంగ నిపుణులు చెపుతున్నారు. హైదరాబాద్ లో హైడ్రా గొడవ… అమరావతిలో వరదల తాకిడి… మరో వైపు ఏ ప్రభుత్వం వస్తే ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని స్థితి ఉందని అంటున్న వ్యాపారులు మరో ప్రాంతాన్ని వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ముంబై శివార్ల వైపు ఇక్కడి వ్యాపారులు చూస్తున్నారని, రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న రాజేందర్ అనే ఆయన చెప్పాడు. ముంబైలో హైదరాబాద్ జాతీయ రహదారి, అలాగే ముంబాయి నుంచి అహ్మదాబాద్ వెళ్లే జాతీయ రహదారిపైపు నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో అందుబాటు ధరల్లో భూములున్నాయని, అక్కడకు వెళ్లి విల్లా ప్రాజెక్టులు చేసుకున్నా చాలని కొంత మంది నిర్మాణదారులు అటువైపు చూస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తెలిపారు. హైడ్రా ఏమో కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కుప్పకూలిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆగిన రిజిస్ట్రేషన్లు..

గత కొంత కాలంగా నగరంలో విక్రయాలు పడిపోయాయని, హైడ్రాతో పాత అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయని చెపుతున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ల రాబడి కూడా తగ్గిందని తెలుస్తోంది. ‘ఆక్రమణలు తొలగించండి కానీ… పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చి, వివరణలు తీసుకోండి.. అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకొండి. అక్కడ ఉంటున్న ప్రజలను రీ లొకేట్ చేయండి. ఆతరువాత ఆక్రమణలపై చర్యలు తీసుకోండి’ అని బాధితులు మొత్తుకుంటున్నారు. ఏమీ చేయకుండా కనీసం నోటీసులు కూడా లేకుండా చేపడుతున్న చర్యలతో సామాన్యప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు.