న్యూఢిల్లీ : భారత దేశంలో హెలికాప్టర్ తో కృష్ణ జింకలను పట్టుకునేందుకు చేసిన తొలి ప్రయత్నం విజయవంతమైంది. మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ పంట పొలాల్లో ప్రవేశించి రైతులను ఇబ్బంది పెడుతున్న కృష్ణ జింకలను సురక్షితంగా బంధించి గాంధీసాగర్ అభయారణ్యంలోకి విడిచిపెట్టారు. ఈ ఆపరేషన్‌ లో దక్షిణాఫ్రికా కన్జర్వేషన్ సొల్యూషన్స్ రెస్క్యూ టీమ్ కీలకపాత్ర పోషించింది.

ప్రజలకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణల నివారణ దిశగా ఈ ఆపరేషన్ గొప్ప మైలురాయిగా భావిస్తున్నారు. హెలికాప్టర్ తో కృష్ణ జింకల వేటకు మధ్యప్రదేశ్ అటవీ శాఖ బోమా సంగ్రహణ పద్ధతిని హెలికాప్టర్ సహాయంతో ఉపయోగించింది. దేశంలోనే తొలిసారిగా హెలికాప్టర్ సహాయంతో కృష్ణ జింకలను విజయవంతంగా పట్టుకోవడం జరిగిందని ఎంపీ అటవీ శాఖ ప్రకటించింది.