Murder | ఇంత దారుణమా.. రూ.600 కోసం వ్యక్తి ప్రాణం తీశారు!

సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.600 రూపాయల వివాదంపై హోటల్‌ సిబ్బంది దాడి చేయడంతో ఓ టూరిస్ట్‌ గైడ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Murder | ఇంత దారుణమా.. రూ.600 కోసం వ్యక్తి ప్రాణం తీశారు!

విధాత, హైదరాబాద్ :

సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.600 రూపాయల వివాదంపై హోటల్‌ సిబ్బంది దాడి చేయడంతో ఓ టూరిస్ట్‌ గైడ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విస్లావత్‌ శంకర్‌ అనే వ్యక్తి టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తూ హైదరాబాద్ కు వచ్చే పర్యాటకులకు నగరం చూపిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 21న గుజరాత్‌ నుండి కొంతమంది పర్యాటకులు నగరానికి వచ్చారా. వాళ్లను శంకర్‌ కర్మన్‌ఘాట్‌లోని ఎన్‌-7 ఎలైట్‌ హోటల్‌లో ఏసీ గదులు బుక్‌ చేసి ఉంచాడు. తరువాతి రోజు (అక్టోబర్‌ 22) ఉదయం 6.30 గంటల సమయంలో చెక్‌అవుట్‌ చేసే సమయంలో రూ.600 తక్కువ ఇవ్వడంతో శంకర్‌కి హోటల్‌ సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈక్రమంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీయడంతో హోటల్‌ లో పనిచేస్తున్న నూర్‌, కమలుద్దీన్‌, ఇస్లాం జహీదుల్‌, రహీమ్ అనే నలుగురు సిబ్బంది కలిసి శంకర్‌ను దాడి చేశారు. ఆ సమయంలో నూర్‌ కుర్చీతో శంకర్‌ తలపై, ఎడమ దవడ, చెవి వద్ద బలంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యాడు. తరువాత టూరిస్ట్ గైడ్ శంకర్ సమీపలోని ఓ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకుని ఇంటి వెళ్లిపోయాడు. అయితే, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో అపస్మారగక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా శంకర్ ను ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శంకర్‌ అక్టోబర్‌ 27న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.