విధాత, హైదరాబాద్ :
బ్రిడ్ అన్యుటీ మోడ్ (హ్యామ్) టెండర్లలో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హ్యామ్ లో కిలోమీటర్కు 85 శాతం అంచనా వ్యయం పెంచి.. తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే రోడ్లకు 17,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని విమర్శించారు. ఓ పని టెండర్కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిని కూర్చోబెట్టి వాటాలు పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని గన్ పెట్టి బెదిరించారని ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారన్నారు.
మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలో సీఎం, మంత్రి వివాదంలో అధికారిని బలి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హ్యామ్) టెండర్లలో 8 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే రోడ్లకు పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారన్నారు. 8 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందన్ని ఆయన ఆరోపించారు. సీఆర్ఎఫ్ కింద కిలోమీటర్కు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. కానీ, హ్యామ్ కింద ఇచ్చిన టెండర్లలో కిలోమీటర్కు మూడు కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. సీఆర్ఎఫ్ కింద ఇచ్చిన రోడ్ల పనుల టెండర్ల జీవో, హమ్ జీవో కేవలం పది రోజుల తేడాలో వచ్చాయని చెప్పారు. సీఆర్ఎఫ్ కింద ఇచ్చిన జీవోలో కిలోమీటర్కు ఓ రేటు, హ్యామ్ జీవోలో కిలోమీటర్కు మరో రేటు ఎలా ఉంటుంది? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
హ్యామ్ రోడ్ల టెండర్లు దక్కించుకున్న వారికి పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రభుత్వం చెల్లిస్తోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ పదిహేడు వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి జేబుల్లోకి వెలుతాయో అందరికీ తెలుసన్నారు. హ్యామ్ కింద కిలోమీటర్ రోడ్డుకు మెయింటెనెన్స్కు మరో 2.5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, అంటే కిలోమీటర్ రోడ్డుకు హామ్ కింద 6 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. హ్యామ్ లో 40 శాతం ప్రభుత్వం 60 శాతం ప్రైవేటు సంస్థలు భరిస్తాయని అంటున్నారని, కానీ, ప్రైవేటు సంస్థలు బ్యాంకుల నుంచి తెచ్చే అప్పులకు ప్రభుత్వమే వడ్డీ కట్టాల్సి ఉంటుందని వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. హ్యామ్ మోడల్ ప్రజల మీద పెనుభారం మోపే మోడల్ అని, ఈ హ్యామ్ టెండర్లు తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హ్యామ్ రోడ్లలో పాలుపంచుకుంటున్న ఇంజినీర్లు, అధికారులు, బడా కాంట్రాక్టర్లు ప్రభుత్వ దోపిడీలో భాగస్వామ్యం కావద్దని సూచించారు. ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.
కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హమ్ టెండర్లపై సీబీఐ దర్యాప్తు చేయించాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దోచుకునే విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ అయ్యిందని ధ్వజమెత్తారు. ఢిల్లీకి మాటిమాటికీ సీఎం వెళ్ళేది తన అవినీతి నుంచి కాపాడుకునేందుకేనని విమర్శించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వరు కానీ హామ్ కింద మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎలా ఇస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
