RBI New Governor । ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా నియమించింది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ డిసెంబర్ 10వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. మల్హోత్రా 1990 రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియామకానికి కేంద్ర క్యాబినెట్లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్టు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఆయన ఈ పదవిలో 11.12.2024 నుంచి మూడేళ్లపాటు ఉంటారు. కాన్పూర్ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ పట్టా పొందిన మల్హోత్రా.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు. తన 33 ఏళ్ల సర్వీసు కాలంలో విద్యుత్తు, ఆర్థిక, పన్నులు, సమాచార సాంకేతికత, గనులు సహా అనేక రంగాల్లో ఆయన గతంలో పనిచేశారు. రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శిగా మల్హోత్రా పనిచేశారు.