Cold wave in Delhi | ఉత్తరభారతంపై చలిపంజా విసురుతున్నది. దేశ రాజధాని ఢిల్లీనగరంలో చలి విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా పొగమంచు పేరుకుపోతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అలెర్ట్ను ప్రకటించగా.. ఇప్పటి వరకు విమానాశ్రమంలో విమానాల రాకపోలకలు సాధారణంగానే ఉన్నాయి. ఢిల్లీలో శుక్రవారం నాలుగు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎముకలు కొరికే చలిలో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఢిల్లీలోని ఆయనగర్లో 1.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనికి తోడు చలిగాలులు వీచాయి. వరుసగా ఆరో రోజు సగటున నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత గురువారం సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి, పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 32 రైళ్లు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ – ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ సైతం ఉన్నది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే పలు రైళ్లు సైతం ఆలస్యంగానే నడుస్తున్నాయి.