అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ నేత బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
విధాత బ్యూరో, కరీంనగర్: అయోధ్యలో ఈనెల 22న జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పవిత్రమైన దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంటకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ప్రసిద్ధిగాంచిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు ఆశీస్సులు అందించారు. అనంతరం సంజయ్ సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ పరిసరాలను శుద్ధి చేయడం సంతోషంగా వుందన్నారు. అయోధ్యలో ఈనెల 22న జరగబోయే అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమైన నేపథ్యంలో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన వుందన్నారు. అయోధ్య అక్షింతలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా… ‘‘అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు వుండవని, పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదన్నారు. కాంగ్రెస్ నేతలు కోరితే బాస్మతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
ఇంటింటా జై శ్రీరాం
అయోధ్యలో ఈనెల 22న శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రమంతా జై శ్రీరాం నినాదాలతో మారుమోగుతోంది. అందులో భాగంగా కరీంనగర్ లో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ తమ ఇళ్ల ముందు స్వచ్ఛందంగా ‘‘జై శ్రీరాం’’అనే వాల్ రైటింగ్ రాయించుకుంటున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం తన నివాసంలో స్వయంగా ‘‘జై శ్రీరాం’’ అని వాల్ రైటింగ్ చేయడం గమనార్హం.
సైకిల్ పై ‘చలో అయోధ్య’
అయోధ్యలో ఈనెల 22న రాముడి విగ్రహ ప్రాణ:ప్రతిష్ట నేపథ్యంలో కరీంనగర్ యువకులు కరీంనగర్ నుండి అయోధ్యకు సైకిల్ పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నగరానికి చెందిన మంగ వంశీ కృష్ణ, ఆదిత్య అనే ఇద్దరు యువకులు శుక్రవారం బండి సంజయ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశమున్నందున జాగ్రత్తగా వెళ్లాలని, వీలైనంత మేరకు పగటిపూటే సైకిల్ యాత్ర కొనసాగించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు.