Site icon vidhaatha

Bandi Sanjay | KCR.. చంద్ర మండలంపై మూడెకరాలు ఇస్తానన్నా ఆశ్చర్యపోవద్దు: బండి సంజయ్

Bandi Sanjay |

విధాత బ్యూరో, కరీంనగర్: ‘రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ అలవికాని హామీలు ఇస్తూ పోతున్నారు. మరోసారి తమకు పట్టం కడితే ఒక్కో కుటుంబానికి చంద్రమండలంపై మూడు ఎకరాల భూమి కేటాయిస్తా అని ప్రకటించినా, ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే శాసనసభ నియోజకవర్గం పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు శుక్రవారం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి, రానున్న ఎన్నికల్లో విజయ అవకాశాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత శాసనసభ్యుల అవినీతి చిట్టా తన వద్ద ఉందని, వారు 30% కమిషన్లు తీసుకుంటున్నారని స్వయంగా చెప్పిన కేసీఆర్… అలాంటి వారందరినీ తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అందరికన్నా ముందు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక పరమార్థం వేరే ఉందని అన్నారు.

న్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఇందులో నుంచి చాలామందికి మొండిచేయి చూపక తప్పదన్నారు. అధికార పార్టీ శాసనసభ్యుల్లో అనేకమంది బీజేపీలో చేరే అవకాశం ఉందని గుర్తించిన ముఖ్యమంత్రి, ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు హడావుడిగా అందరికీ టికెట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు.

కాగా ఉత్తర ప్రదేశ్, అసోం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులు రామస్వామి, బసవరాజ్, ధర్మేశ్వర్ కోన్వర్, దిగంత కలిత, మునిరాజ్, శశాంక్ త్రివేది, హేమంత తగోరియా తదితరులు సంజయ్ ను కలిసిన వారిలో ఉన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వారందరితో కలిసి సంజయ్ కుమార్ మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Exit mobile version