Bandi Sanjay | ఏం చేస్తున్నారు?.. అధికారుల పనితీరుపై బండి ఫైర్
ఇకపై కేంద్ర పథకాలపై ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను మీడియాకు రిలీజ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దిశ సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.
విధాత :
ఇకపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కేంద్ర పథకాలపై ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను మీడియాకు రిలీజ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దిశ సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. శాఖల వారీగా అధికారుల నిర్లక్ష్యంపై కేంద్ర మంత్రి నిలదీశారు. విద్య, వైద్యం, ఆర్ అండ్ బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, సోలార్, పరిశ్రమల శాఖలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా.. ప్రజలకు తెలియజేయకపోతే ఎట్లా? అని బండి ప్రశ్నించారు. కరీంనగర్లో యూజీడీ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. గుంతలు తవ్వి వదిలేశారు..నిధులన్నీ సర్వనాశనం చేశారు అని అధికారులపై కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు.
కష్టపడి నిధులు తీసుకొచ్చినా..కరీంనగర్ కార్పొరేషన్ లో ఎంపీ లాడ్స్ గ్రౌండ్ కావడంలో జాప్యమెందుకు అని బండి ప్రశ్నించారు. ఎంసీకే అధికారుల నిర్లక్ష్యం సహించరానిది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అమృత్ స్కీం పూర్తి పర్యవేక్షణ, బాధ్యత కమిషనర్ దేనని చెప్పారు. ‘గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాక కట్టెల పొయ్యిపై ఎందుకు వండుతున్నారు?. ఆర్ అండ్ బీ పనులు నత్తనడకన పనులు చేస్తుంటే ఏం చేస్తున్నారు?. కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయ్యి ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారు?. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం ఇంకెంత కాలం?. జనం అల్లాడుతున్నా.. మీకు పట్టింపు లేదా? గన్నేరువరం నుండి బెజ్జంకి రోడ్డు పనుల్లో తీవ్ర నిరక్ష్యం ఎందుకు?. నిరంతరం అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదు?. ఆసుపత్రుల నిధులన్నీ దాదాపుగా కేంద్రమే ఇస్తోంది..అయినా ఆశించిన రిజల్ట్స్ లేకపోతే ఎలా?’ అని బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ లోని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు మరింతగా వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మెడిసిన్స్ కూడా ఇవ్వకపోతే ప్రజలు బాధ పడుతున్నారని, మెడిసిన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. మెడిసిన్స్ ఇవ్వకపోతే ప్రజలెందుకు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారని అన్నారు. ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు పంపిస్తే.. నేనే సీఎస్సార్ నిధులు తెచ్చి మందులకు వెచ్చిస్తాని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారులు ట్రీట్మెంట్ తీసుకుంటే సామాన్యులకు కూడా భరోసా వస్తుందని బండి సూచించారు. బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా విశ్వకర్మ, పీఎంఈజీపీ రుణాలెందుకు ఇవ్వడం లేదని అధికారులను బండి సంజయ్ ప్రశ్నించారు.
తనఖా లేకుండా రూ.25 లక్షలలోపు రుణాలు ఇవ్వాలని కేంద్ర గైడ్ లైన్స్ ఉన్నా పట్టించుకోరా? అని నిలదీశారు. వెంటనే బ్యాంకులతో మాట్లాడి రుణాలిప్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కు బండి సూచించారు. తక్షణమే రిజల్ట్ వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై తక్షణమే కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాట వినని బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లను వెనక్కు తీసుకోవాలని వెల్లడించారు. ‘నేను కిందిస్థాయి నుండి ఎదిగిన వ్యక్తిని.. నేనెప్పుడూ రూల్స్ కు వ్యతిరేకంగా పని చేయాలని చెప్పను. ప్రజా సమస్యల పరిష్కారంపై మా ఆఫీస్ నుండి లేఖ పంపితే కొందరు రిప్లై ఇవ్వడం లేదు. ఇకపై అలా చేస్తే సహించే ప్రసక్తే లేదు’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram