విధాత : అమెరికాలో ఉన్నత చదువులు..మంచి సంపాదనతో కూడిన ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్ధులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. అమెరికాలో చదువుకోవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్కు బ్రేకులు వేసేలా ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తుంది. వలస విధానాలు, సోషల్ వెట్టింగ్ నిబంధనలను యూఎస్ ప్రభుత్వం కఠినతరం చేస్తుంది. ఎఫ్ 1 వీసాదారులకు సంబంధించి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నిబంధన రద్దు చేసింది.
గతంలో ఎఫ్1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకూ ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ కింద ఉండేవారు. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేసి నిర్దిష్ట కాలపరిమితిని అమలు చేసేందుకు సిద్ధమైంది. కొత్త నిబంధన ప్రకారం 4 ఏళ్లకు మించి యూఎస్ లో ఉండాలంటే..మళ్లీ స్పెషల్ అనుమతి తప్పనిసరి చేసింది. ఈ నిబంధన సెప్టెంబర్ నుంచి అమలులోకి రానుంది. ఎఫ్-1 వీసాదారుల నివాస అనుమతిపై కూడా ట్రంప్ సర్కారు పరిమితి విధించింది.
మరోవైపు 2024తో పోలిస్తే 2025లో ఇండియన్ స్టూడెంట్స్ వీసాల్లో ఏకంగా 62 శాతం కోత పెట్టింది. అమెరికాలోని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) నివేదిక మేరకు 2025 సీజన్లో భారీగా అమెరికా స్టూడెంట్ వీసా అనుమతులను భారీగా తగ్గించింది. 2025 మే-ఆగస్టు మధ్య ఇండియన్స్కు జారీ అయిన F-1 వీసాల్లో 58,694 నుంచి 22,149కి తగ్గుదల నమోదైంది. చైనాతో పోలిస్తే భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణలే ఎక్కువగా ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులో చిన్న లోపం ఉన్నా తిరస్కరిస్తున్నారు.
వీసాలు తగ్గినప్పటికీ భారతీయ విద్యార్ధులు మాత్రం అమెరికా యూనివర్సిటీలలో చేరికకు మొగ్గు చూపుతున్నారు. విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికి అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాకాలేజీల్లో చేరిన ఇండియన్స్ సంఖ్య 3,63,019గా ఉండటం గమనార్హం. సాధారణంగా ఏటా ఈ సీజన్లో భారతీయులకు సగటున 50వేల పైనే విద్యార్థి వీసాలు వస్తాయి. కానీ, గతేడాది ఈ సంఖ్యలో భారీ తగ్గుదల కన్పించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో చైనా నుంచి 2,65,919 మంది గతేడాది అమెరికాకు చదువుకునేందుకు రావడం గమనార్హం.