చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్ పై అవిశ్వాసం అదనపు కలెక్టర్కు లేఖ ఇచ్చిన కౌన్సిలర్లు గండ్రకు చారిసాబ్ భయం? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి మున్సిపాలిటీలో ముసలం ఏర్పడింది. అధికార పార్టీ చేతిలో ఉన్న ఈ మునిసిపాలిటీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. అవిశ్వాసం ముప్పుతో అధికార పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పి ఏర్పడింది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనే చర్చ సర్వత్రా సాగుతుంది. ముగ్గురి పై అవిశ్వాసం లేఖ భూపాల్ పల్లి […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి మున్సిపాలిటీలో ముసలం ఏర్పడింది. అధికార పార్టీ చేతిలో ఉన్న ఈ మునిసిపాలిటీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. అవిశ్వాసం ముప్పుతో అధికార పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పి ఏర్పడింది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనే చర్చ సర్వత్రా సాగుతుంది.
భూపాల్ పల్లి మున్సిపాలిటీ పాలకవర్గం కాలపరిమితి మూడున్నర ఏళ్ళు దాటినందున అవిశ్వాసానికి అధికార పార్టీలోని అసమ్మతి కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. మున్సిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పై అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధం అయ్యారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ దివాకర్కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన లేఖ అందజేశారు. ముగ్గురికి వ్యతిరేకంగా పట్టణంలో 30 వార్డులు ఉండగా 20 మంది కౌన్సిలర్లు ఈ లేఖ పై సంతకాలు పెట్టినట్లు చెబుతున్నారు. అధికార పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టడం చర్చగా మారింది. పట్టణ అభివృద్ధిని విస్మరించి ముగ్గురు అవినీతికి పాల్పడుతున్నారని అసమ్మతి కౌన్సిలర్లు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన భూపాల్ పల్లి మున్సిపాలిటీలో నెలకొన్న అవిశ్వాస తీర్మానం ఏమలుపు తీసుకుంటుందోనని పార్టీలో ఆందోళన నెలకొంది. విశ్వాస తీర్మానం లేఖ ఇచ్చిన అసమ్మతి కౌన్సిలర్లు స్థానికంగానే ఉండాలా లేదా ప్రత్యేక క్యాంపు నిర్వహించాలా అనే చర్చ చేస్తున్నట్లు సమాచారం. మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం లేఖ పై సంతకం పెట్టినందున చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్లు ఏం చేయలేరని తప్పనిసరి అధిష్టానం కూడా వారిని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే అభిప్రాయం నెలకొంది. తమలో ముగ్గురికి అవకాశం కల్పించాలని అసమ్మతి కౌన్సిలర్లు కోరుతున్నారు. ఎన్నికలకు ముందే ఈ అవగాహన ఉన్నప్పటికీ వారు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో అసమ్మతి చిచ్చు రగలడం పట్ల ఎమ్మెల్యే గండ్ర ఒకింత అసంతృప్తికి లోనైనట్లు భావిస్తున్నారు. పార్టీలో గ్రూపులు పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్ ముగ్గురు ఎమ్మెల్యేను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ సంక్లిష్ట సమయంలో ఆచితూచి వ్యవహరించుకుంటే అసమ్మతి కౌన్సిలర్లు ఎమ్మెల్సీ చారి సాబ్ ను సంప్రదించే అవకాశాలు ఉన్నట్లు గండ్ర శిబిరంలో ఆందోళన నెలకొంది. చారి సాబ్ కూడా ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు ఆయన వర్గానికి చెందిన నాయకుడు చెబుతున్నారు. ఎవరు ఏ వైపు స్టాండ్ తీసుకుంటారనేది రానున్న రోజుల్లో తేలనుంది.
ఈ సమయంలో మున్సిపాలిటీలో నెలకొన్న అసమ్మతిని ఇరువురు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందోనని చర్చ సాగుతోంది.