BJP, BRS బయ్యారం చుట్టూ భలే రాజకీయం గిరిజనం ఆశల పైన సర్కార్ల నీళ్ళు ఎనిమిదేళ్ళుగా పరిశ్రమ ఊసేలేదు విభజన చట్టం అమలుకు దిక్కులేదు ప్రధాని రాకతో మరోసారి తెరపైకి బీజేపీ నేత కిషన్ రెడ్డి ఎదురుదాడి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార పక్షాలైన బీజేపీ, బీఆరెస్ రాజకీయ చక్రబంధంలో చిక్కుకుని బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నలిగిపోతున్నది. పరిశ్రమ చుట్టూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయం మాత్రం సాగుతున్నది. బీఆరెస్, బీజేపీ నేతలు పరస్పర […]
BJP, BRS
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార పక్షాలైన బీజేపీ, బీఆరెస్ రాజకీయ చక్రబంధంలో చిక్కుకుని బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నలిగిపోతున్నది. పరిశ్రమ చుట్టూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయం మాత్రం సాగుతున్నది. బీఆరెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో అప్పుడప్పుడు చర్చనీయాంశం చేస్తున్నారు.
పరిశ్రమ ఏర్పాటు చేస్తే తమకు ఉపాధి లభిస్తుందనే స్థానిక నిరుద్యోగుల ఆశలను ఓటు బ్యాంకు రాజకీయాలకు రెండు పార్టీలూ వాడుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చూసేవారికి అబ్బో ఉక్కు పరిశ్రమ పైన ఈ రెండు పార్టీలకు ఎంత ప్రేమో! అనేంత తీరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత సమస్యను అటకెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ళుగా స్థానిక ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు.
వాస్తవానికి పరిశ్రమ ఏర్పాటు అనేది రాష్ట్ర విభజన చట్టంలోని హక్కైనప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విపక్షపార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం–ఎల్) న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాలు చేపట్టిన నిరసనలనూ, స్థానిక గిరిజన సంఘాల ఆందోళనను అధికార పక్షాలు పెడచెవిన పెడుతున్నాయి.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న వరంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ తరచూ ప్రకటిస్తూ వస్తున్నారు. గతంలో ఒకసారి ఈ ప్రకటన చేసిన కిషన్ రెడ్డి మొన్న ఆదివారం వరంగల్లో చేసిన ప్రకటనతో మళ్ళీ సమస్య రాజుకున్నది.
కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సంగతి పక్కన పెట్టి గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారని ఆ హామీ ఎందుకు అమలు చేయలేదంటూ ఉల్టా ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్రం ఏం చేస్తుందో చెప్పకుండా ఎదురు ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కూడా మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఖనిజ సంపద నాణ్యత లేదని చెప్పారు. ఇంకేముంది బీఆరెస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత కేంద్ర మంత్రి పై మండిపడ్డారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటవా? ఇక్కడి ఖనిజం పరిశ్రమ ఏర్పాటుకు పనికిరాదంటావా? నీకు నోరెలా వచ్చిందంటూ దుమ్మెత్తారు. అక్కడితో ఆగని ఎంపీ కవిత.. ఆగమేఘాల మీద బయ్యారంలో ఒక్కరోజు దీక్ష చేపట్టి నిరసన తెలియజేశారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ శ్రేణులతో కలిసి గూడూరు మండలం ఊట్ల, మట్వాడ, కొంగరగిద్ద, నేలవంచ, ఖమ్మం జిల్లా బయ్యారం, మొట్ల తిమ్మాపురంలోని కొండలను సైతం లెక్క చేయకుండా అటవీ ప్రాంతంలో పర్యటించారు. విభజన హామీలపై ఈమధ్య సీపీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా ఈ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
బయ్యారం పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికిచ్చినట్లు చెబుతున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయకుండా తప్పించుకునేందుకు ఇక్కడ నాణ్యమైన ఐరన్ ఓర్ లేదని కేంద్రం అబద్ధాలు చెబుతున్నదని విమర్శిస్తున్నారు. కాగా, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో రాష్ట్రం సైతం మొదటి నుంచి గట్టిపట్టు పట్టలేదు.
బీజేపీతో ఇంతకాలం కొనసాగిన స్నేహం ఈ ప్రాంతవాసులకు శాపంగా మారింది. అందుకే బీజేపీ పరిశ్రమ ఏర్పాటును పట్టించుకోలేదంటున్నారు. ఇక తెలంగాణ విభజన హామీల పట్ల తమకు అలవాటైన వివక్షనే బయ్యారం ప్లాంట్ విషయంలోనూ కేంద్రం చూపిస్తున్నది. అయినా బీఆరెస్ ప్రభుత్వంలో చలనంలేదని విమర్శిస్తున్నారు.
పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగులకు, గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశలు ఈ నాయకులే కల్పించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన స్థానికుల సంతోషం నెమ్మదిగా సన్నగిల్లింది. గిరిజన యువతలో నెలకొన్న ఆశలు నీరుగారుతున్నాయి. ప్రధాని మోదీ తన పర్యటనలో బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందిస్తారని ఆశాభావంతో స్థానికులు ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యాలు నిజాయితీతో పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాకపోతే స్థానిక ఖనిజాన్ని వినియోగించుకుని ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చుకదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం కష్టం కాదంటున్నారు. ఈ విషయంలో బీజేపీ అవకాశవాదాన్ని నిలదీయాల్సిన ప్రజాప్రతినిధులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఉక్కు పరిశ్రమ పై విపక్షాల నిరసనలు, నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకుండా అధికారంలో ఉన్న బీజేపీ, బీఆరెస్ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విభజన హామీలపై స్పష్టత ఇవ్వకుండా మోడీ వరంగల్లో అడుగుపెట్టే హక్కు లేదని సీపీఐ నాయకులు అంటున్నారు.