BJP ఉత్కంఠ రేపుతున్న బిజెపి నేతల చర్చలు!! విధాత: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో తెలంగాణ బిజెపి నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిజెపి హై కమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు ముందుగా పార్టీ జాతీయ కార్యాలయంలో బిఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. అనంతరం వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ […]
BJP
విధాత: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో తెలంగాణ బిజెపి నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిజెపి హై కమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు ముందుగా పార్టీ జాతీయ కార్యాలయంలో బిఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. అనంతరం వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కాగా, ఈభేటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్చార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ లు కూడా హాజరయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, బిజెపి పార్టీ పరిస్థితిపై వారు నడ్డాకు వివరించారు.
సీఎం కేసీఆర్ ను గద్దే దించాలన్న తమ లక్ష్యాలకు అనుగుణంగా పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఈటేల, రాజగోపాల్ రెడ్డిలు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం, భవిష్యత్తు రాజకీయ అవసరాల నేపథ్యంలో బిజెపి క్రమంగా బీఆర్ఎస్ కు దగ్గర అవుతుందన్న ప్రచారం, కవిత అరెస్టు మరుగునపడడం వంటి పరిణామాలపైన, బిజెపి రాష్ట్ర నాయకత్వం మార్పు అంశాలపైన ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు నడ్డాతో చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
రాత్రి వరకు కూడా వారి భేటీ కొనసాగగా.. అనంతరం అమిత్ షాతో కూడా ఈటెల, రాజగోపాల్ రెడ్డిల భేటి ఉండడంతో బిజెపిలో నెలకొన్న తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాగా భేటీ అనంతరం ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బిజెపిలో ఇటీవల తలెత్తిన పరిణామాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నా దానిపై తమ సూచనలు అడిగారని తెలిపారు. హై కమాండ్కు అన్ని విషయాలు తెలుసు అన్నారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరామన్నారు. ముక్కు సూటిగా తమ అభిప్రాయాలు వారికి వివరించామన్నారు. అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. ప్రజలకు మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ని గద్దె దించడం ఖాయం అన్నారు.