మృత్యువులోనూ వీడని బంధం.. Jagtial | ఇది హృదయ విదారక ఘటన.. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారికి కాటికి వెళ్లారు. స్నేహితుల్లా ఉండే ఆ ఇద్దరు గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మొదట తమ్ముడు గుండెపోటుకు గురయ్యాడు. అతని అంతిమయాత్రలో పాల్గొన్న సోదరుడు కూడా గుండెలవిసేలా రోదించి.. కుప్పకూలాడు. ఇద్దరు కుమారులకు గంటల వ్యవధిలోనే అంత్యక్రియలు నిర్వహించడం.. అటు తల్లిదండ్రులు, ఇటు బంధువుల హృదయాలను కలిచివేసింది. ఈ ఘటన జగిత్యాల […]
మృత్యువులోనూ వీడని బంధం..
Jagtial | ఇది హృదయ విదారక ఘటన.. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారికి కాటికి వెళ్లారు. స్నేహితుల్లా ఉండే ఆ ఇద్దరు గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మొదట తమ్ముడు గుండెపోటుకు గురయ్యాడు. అతని అంతిమయాత్రలో పాల్గొన్న సోదరుడు కూడా గుండెలవిసేలా రోదించి.. కుప్పకూలాడు. ఇద్దరు కుమారులకు గంటల వ్యవధిలోనే అంత్యక్రియలు నిర్వహించడం.. అటు తల్లిదండ్రులు, ఇటు బంధువుల హృదయాలను కలిచివేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి పట్టణానికి చెందిన బోగ భూషణ్కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సచిన్(38) కోరుట్లలోని కేడీసీసీ బ్యాంకులో ఉద్యోగి. రెండో కుమారుడు శ్రీనివాస్(36) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు అరవింద్ కూడా హైదరాబాద్లోనే ఉంటూ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రెండో కుమారుడు శ్రీనివాస్ శనివారం గుండెపోటుకు గురయ్యాడు. అదే రోజు హైదరాబాద్ నుంచి మెట్పల్లికి శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు.
సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న అన్న సచిన్ గుండెలవిసేలా రోదించాడు. అంత్యక్రియలు కొనసాగుతుండగానే సచిన్ కుప్పకూలిపోయాడు. బంధువులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే అన్నదమ్ముల దహన సంస్కారాలు నిర్వహించాల్సి రావడంతో.. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సచిన్కు భార్య ఉండగా, శ్రీనివాస్కు భార్య, 14 నెలల కుమార్తె ఉంది.