Minister Talasani బీసీలు ఎటువైపో..? కేసీఆర్ వైపు బీసీలు ర్యాలీ అవుతారా? మంత్రి తలసాని ఇంట్లో బీఆరెస్ బీసీ నేతల సమావేశం విధాత: రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలను తమ వైపుకు తిప్పుకోవడానికి కాంగ్రెస్, అధికారంలో ఉన్నబీఆరెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీఆరెస్ నేతుల పోటా పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్క అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ నేతలతో పలుసార్లు సమావేశాలు నిర్వహించింది. బీసీ సంఘాలు […]
Minister Talasani
విధాత: రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలను తమ వైపుకు తిప్పుకోవడానికి కాంగ్రెస్, అధికారంలో ఉన్నబీఆరెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీఆరెస్ నేతుల పోటా పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్క అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ నేతలతో పలుసార్లు సమావేశాలు నిర్వహించింది. బీసీ సంఘాలు నిర్వహించే సమావేశాలకు సంఘీ భావం కూడా తెలిపింది.
త్వరలో భారీ ఎత్తున బీసీ గర్జన సభ నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేయాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీఆరెస్ పార్టీ అలర్ట్ అయింది.
బీసీ సమాజిక వర్గాన్ని కాంగ్రెస్కు దూరం చేయాలన్న లక్ష్యంతో బీఆరెస్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలపై కౌంటర్ అటాక్ చేయాలని నిర్ణయించింది. ఇలా బీసీలను కాంగ్రెస్కు దగ్గర కాకుండా ఉండే విధంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నది.
బీసీ నేతలపై మాట్లాడితే ఉరుకోమంటున్న బీఆరెస్
బీసీలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఏ విధంగా కట్టడి చేయాలి? అన్నదానిపై కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్లు పార్టీకి చెందిన బీసీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీ నేతలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆరోపించింది. బీసీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమాజంలో 56% బీసీ జనాభా ఉందని, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని తెలిపారు. తాము బానిసలం కాదు చైతన్యవంతులమన్నారు.
వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలను, నేతలను టార్గెట్ గా చేసి దూషించడం కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ లోని బీసీ నేతలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వెనుకబడిన వర్గాలకు మొత్తం సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాకు అన్యాయం జరిగితే కులాలుగా కాదు బీసీ సమాజంగా ప్రశ్నించి, తిరగబడతామన్నారు. మీలాగా బీసీలను, దళిత, వెనుకబడిన వర్గాలను దూషిస్తూ మేము మాట్లాడలేమని, తమకు కేసీఆర్ సంస్కారం నేర్పారన్నారు.