ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.. మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మంచోడే.. కానీ మంచాన పడ్డాడని పాలమూరులో అన్నాడు.
పార్లమెంట్ లో నేను పడుకోలేదు.. రేవంత్.. పాలమూరులో నువ్వు పడుకున్నావు
నేను మంచాన పడలేదు.. పథకాలు అమలు చేయకుండా నువ్వు మంచాన పడ్డావు
మోసపూరిత వాగ్దా నాలతో గద్దెనెక్కి కేసీఆర్ విమర్శిస్తావా
నేను మంచోన్ని అయినందుకే పరిశ్రమలు స్థాపించి వేల మందికి ఉపాధి చూపా
జిల్లా కు ఏమి చేసావో రేవంత్ రెడ్డి చెప్పాలి
మళ్ళీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ లో అభివృద్ధి
ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.. మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మంచోడే.. కానీ మంచాన పడ్డాడని పాలమూరులో అన్నాడు. రేవంత్ రెడ్డి అనడమే కాదు నేను నిజంగా మంచోన్నే.. అనే విషయం పాలమూరు ప్రజలకు తెలుసు అని మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరును అభివృద్ధి చేయలేక ఇక్కడి నుంచి పారిపోయి ఇతర ప్రాంతాల్లో రాజకీయం చేసి పాలమూరు ప్రజలను ఆగం చేసిన నువ్వు మంచాన పడ్డావు అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల, కార్యకర్తల సమావేశంలో మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు మాని తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న నేతను సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడడం తెలంగాణ ప్రజలను అవమానిచ్చినట్లే అని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం పచ్చ బడాలనే మంచి సంకల్పంతో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించిన అపారభగీరతుడన్నారు. 2014 తరువాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కేసీఆర్ ముందుచూపుతో అన్ని రంగాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేసి కార్యరూపం తెచ్చారన్నారు. అలాంటి గొప్ప నేతను.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మోసపూరిత పథకాలకు ప్రజలు ఆకర్శితులై బీఆర్ఎస్కు ఓటు వేయకుండా కాంగ్రెస్కు వేసి మహానేత కేసీఆర్కు దుఃఖం కల్గించారన్నారని మన్నే పేర్కొన్నారు. కాంగ్రెస్ వంద రోజులు పాలన పూర్తి అయినా ప్రకటించిన పథకాలు అమలు చేయడంలో విఫలం చెందారని ఇప్పటికీ ఈ విషయం ప్రజలు గుర్తించారన్నారు.
దేశంలో ఏ ముఖ్య మంత్రి చేయని అభివృద్ధి ఒక్క కేసీఆర్ మాత్రమే చేశారని, అలాంటి నేతను మనం మళ్ళీ తెచ్చుకోవాలని ఆయన అన్నారు. పథకాలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ కి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తరిమి కొట్టాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేడి తప్పు చేశామనే ధోరణి లో ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ నుంచి జడ్చర్ల జాతీయ రహదారి పొడగునా పరిశ్రమ లు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించిన ఘనత మా కుటుంబానికి దక్కిందన్నారు.
పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఒక్క పరిశ్రమ తెచ్చారా అని మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా నిరుద్యోగ యువత అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు కల్పించామని, అలాంటి వ్యక్తి అయిన నన్ను మంచాన పడ్డారని రేవంత్ రెడ్డి అనడం చూస్తే ఆయన పై జాలి కల్గుతుందన్నారు. ఈ సమావేశం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మా రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.