13న చేరికకు ముహుర్తం ఖరారు
విధాత, వరంగల్ ప్రతినిధిః వరంగల్ తూర్పు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఈ నెల 13వ తేదీన ఆ పార్టీలో చేరేందుకు ముహుర్తం కూడా నిర్ణయిచుకున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరేందర్ పార్టీని వీడుతున్నట్లు, ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం సాగుతున్నప్పటికీ ఆయన కనీసం ఖండించకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే తన అనుచరులతో ఇదే అనుకూల సమయంగా భావించి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇప్పటికే నరేందర్ తీరు నచ్చక పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు.మరికొందరు అనుచరులతో ఈ నెల 13న బీజేపీలో చేరేందుకు అంతర్గతంగా చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న అరూరి రమేష్ మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరి ప్రస్తుతం వరంగల్ ఎంపీగా పోటీచేస్తున్నారు.వరంగల్ తూర్పు నియోజకవర్గం సైతం వరంగల్ ఎంపీ పరిధిలో ఉన్నందున అరూరి రమేష్ చేసిన ప్రయత్నం మేరకు నరేందర్ బీజేపీలో చేరేందుకు రంగం చేసుకున్నట్లు చెబుతున్నారు. గురువారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్న నరేందర్ ఈ విషయాన్ని ఖండించకపోవడంతో గులాబీ పార్టీలోనూ నరేందర్ పార్టీ మారడం ఖాయమనే చర్చ సాగుతోంది.