పదవులు అనుభవించి పార్టీకి దూరం
ఓరుగల్లు బీఆర్ఎస్లో రాజకీయ పరిణామం
వరుసగా పార్టీని వీడుతున్న దళితనేతలు
అంతుబట్టని కారణం, ఆశ్చర్యకర సంఘటనలు
విధాత ప్రత్యేక ప్రతినిధి: అదేంటోగానీ.. ఓరుగల్లు దళిత,గిరిజన నేతలకు గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈ నేతలకు పార్టీ అచ్చిరావడం లేదా? పార్టీ నేతలను ఇముడ్చుకోలేక పోతుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవులు అనుభవించి మరీ పార్టీ వీడుతున్నారు. ఎంపీలుగాగెలిచిన ఎస్టీ నాయకులుకూడా ఇదే బాటపట్టారు. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ పేరు ఏదైనా ప్రయాణం మాత్రం ఇదే విధంగా ఉంది.
అన్నీ అనుభవించీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లో తొలి నుంచి జరుగుతున్న ఈ రాజకీయ పరిణామం ఆసక్తికరమైనదేకాకుండా అంతుబట్టకుండా ఉంది. నిజంగానే పార్టీ దళిత,గిరిజన నాయకులను దూరం పెడుతుందా? వారికి ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదా? అంటే అదేం లేదు. ఒకరిద్దరు మినహా మెజార్టీ నాయకులకు పార్టీ సముచిత స్థానం కల్పించింది. పార్టీ ఇచ్చిన అవకాశం గానీ, వచ్చిన అవకాశంగానీ, తెచ్చుకున్న అవకాశంగానీ ఏదైనా పదవులు అనుభవించడంలో ముందున్నారు. అవకాశాలన్నింటిని అనుభవించిన తర్వాత పార్టీకి దూరమవుతున్నారు. ఇదొక విచిత్రకరమైన పరిణామంగా చెప్పవచ్చు.
పార్టీని వీడిన దళితనాయకులు
బీఆర్ఎస్ పార్టీని దళితనాయకులు వరుసగా వీడుతున్నారు. అన్నీ అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి జిల్లా బీఆర్ఎస్ రాజకీయ పయనంలో ఈ వింత కొనసాగుతూనే ఉన్నది. ఈ పరంపర నేటికి సాగుతూనే ఉన్నది. డాక్టర్ గుండె విజయరామారావుతో ప్రారంభమైన ఈ ‘సంప్రదాయం’ డాక్టర్ కడియం కావ్య వరకు కొనసాగుతోంది.
జీవీఆర్ నుంచి కడియం దాకా
టీఆర్ఎస్ తొలి నాళ్ళలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో కలిసి నడిచిన నాయకుడు డాక్టర్ విజయరామారావు (జీవీఆర్). కేసీఆర్ కు మిత్రుడు, సన్నిహితుడు, పూర్వాశ్రమంలో టీడీపీలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన నాయకుడు. టీడీపీలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ గెలుపొందిన నాయకునిగా విజయరామారావు పేరొందారు. వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తైనప్పటికీ తన రాజకీయం మెదక్ జిల్లా నుంచి ప్రారంభమైంది. సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు నిర్వహించిన కేసీఆర్ కు విజయరామారావుకు ఉన్న సన్నిహిత్యంతో తెలంగాణ రాష్ట్ర సాధనకు కలిసినడిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కూడా ఇద్దరూ కలిసినడిచారు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసింది.
తొలి ఎన్నికల్లో విజయరామారావు స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్ధిగా విజయరామారావు పోటీ చేసి అప్పటి టీడీపీ నేత కడియం శ్రీహరి పై గెలుపొందారు. కాంగ్రెస్ నేతగా ఉన్న డాక్టర్ రాజయ్య ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన విజయరామారావు కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు నిర్వహించారు. టీఆర్ఎస్ లో ఓ వెలుగువెలిగారు.
కాంగ్రెస్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయరామారావు ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ పార్టీ నేతగా తన ప్రాధాన్యతను కొనసాగించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీచేయడంతో టీఆర్ఎస్ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం పార్టీ నేతగా కేసీఆర్ కు అండగా నిలిచారు. ఆ తర్వాత పార్టీలో ప్రాతినిధ్యం తగ్గిపోయి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్నారు.
పరకాల నుంచి శారారాణి
2004లో ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానమైన పరకాల నుంచి శారారాణి పోటీచేశారు. కేవలం తెలంగాణ సెంటిమెంట్ మీదనే ఆమె గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్ వేసిన వలకు చిక్కారు. కాంగ్రెస్ లో చేరకున్నప్పటికీ టీఆర్ఎస్ ను వీడి తర్వాత ఆమె రాజకీయంగా కనుమరుగయ్యారు.
డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్
టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన మరో దళిత నాయకుడు డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ కేసీఆర్ కు నమ్మకమైన నాయకుడిగా, వరంగల్లో గుర్తింపు పొందిన నాయకునిగా ఎదిగారు. 2009లో వరంగల్ ఎస్సీ రిజర్వుడు లోక్ సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2014లో ఆయనను కాదని కడియం శ్రీహరికి అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడంతో పార్టీని వీడి బీజేపీలో తర్వాత కాంగ్రెస్ లో చేరారు.
దొమ్మాటి సాంబయ్య
పోలీసు అధికారిగా ఉంటూ టీడీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన దొమ్మాటి సాంబయ్య పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించిభంగపడ్డారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు.
డాక్టర్ తాటికొండ రాజయ్య
డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ లో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో ఇండిపెండెంట్ గా స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2009 తో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ చేరారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అరునెలల్లోనే ఏ కారణం లేకుండా రాజయ్యను కేసీఆర్ భర్తరఫ్ చేసి తీవ్రంగా అవమానించారు. అయినా పార్టీలో కొనసాగారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించి, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ గా నియమించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తొలి నాయకునిగా రాజయ్య నిలిచారు.
అరూరి రమేష్
పీఆర్పీ నుంచి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన అరూరి రమేష్ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి వరకు వర్ధన్నపేట పార్టీ ఇంచార్జ్ గా ఉన్న పసునూరి దయాకర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పనికిరాడని స్థానికేతరుడైన రమేష్ ను 2014కు ముందు వర్ధన్నపేట ఇంచార్జ్ గా నియమించారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2023 మూడవసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తాజా లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. కడియం కావ్యకు టికెటివ్వడంతో బీజీపిలో చేరిపోయి ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా పోటిలో నిలిచారు. రమేష్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు.
పసునూరి దయాకర్
సామాన్య అర్టిస్టుగా ఉన్న పసునూరి దయాకర్ టీఆర్ఎస్ లో చేరిన కొద్ది కాలానికే వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ గా అవకాశం కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవసరమైన వనరులు, సత్తా లేదని భావించి దయాకర్ స్థానంలో అరూరి రమేష్ ను తీసుకొచ్చారు. అయినప్పటికీ దయాకర్ మిన్నకున్నారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా కడియం శ్రీహరితో రాజీనామా చేయించడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో అభ్యర్ధులుగా ఉద్యమకారుడు న్యాయవాది గుడిమెల్ల రవికుమార్ పేరు దాదాపు ఖరారు చేసిన సందర్భంలో ఆయన కులం పై వివాదం జరిగింది. దీంతో అనూహ్యంగా దయాకర్ పేరు తెరపైకి వచ్చింది. అర్టిస్టుగా ఉన్న దయాకర్ ను తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా అకాశానికెత్తేశారు.
అప్పటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా పక్కకుపెట్టిన దయాకర్ ను ఎంపీగా తెరపైకి తెచ్చారు. దయాకర్ కు సైతం మంచి అవకాశం లభించింది. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. సామాన్యకార్యకర్తకు రెండు పర్యాయాలు ఎంపీగా అవకాశం కల్పించారు. కానీ, మూడవసారి అవకాశం కల్పించకపోవడంతో నిరాశకు లోనయ్యారు. తనను సంప్రదించకుండా కడియం కావ్యను అభ్యర్ధిగా ప్రకటించడంతో అసంతృప్తికిలోనై కాంగ్రెస్ లో చేరిపోయారు.
కడియం శ్రీహరి…కావ్య
2013లో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరి 2014లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత రాజయ్య స్థానంలో కడియాన్ని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఎంపీగా రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2018 ఎన్నికల్లో మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
2023 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని శ్రీహరికి అవకాశం ఇవ్వడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. తాజాగా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ను, అరూరి రమేష్ ను కాదని ఆయన కుమార్తె డాక్టర్ కావ్యకు ఎంపీ టికెటిచ్చారు. అన్ని అవకాశాలు అనుభవించి అధికారం పోగానే రాత్రికి రాత్రి ఎంపీ టికెట్ ను తిరస్కరించి కాంగ్రెస్ లో తండ్రి, కుమార్తె చేరిపోయారు. కావ్యకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఖాయం చేసుకున్నారు.
ఎస్టీ ఎంపీలు సైతం ఇదే బాట
ఎంపీలుగా గెలుపొందిన గిరిజన నాయకులు సైతం బీఆర్ఎస్ కు దూరమయ్యారు. 2004లో జనరల్ స్థానంగా ఉన్న వరంగల్ నుంచి టీఆర్ఎస్ ఎంపీగా పోటీచేసి డి. రవీంద్రనాయక్ గెలుపొందారు. తర్వాత ఆయన కేసీఆర్ తో విభేదించి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014లో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ కు మరోసారి 2019లో అవకాశం ఇవ్వలేదు. తాజాగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి మహబూబాబాద్ ఎంపీగా బరిలో నిలిచారు.
ఓవర్ లోడ్ కారిప్పుడు ఖాళీ
నిన్నటి వరకు దళిత నాయకులతో ఓవర్ లోడ్ గా కనిపించిన కారు ఇప్పుడు ఖాళీ అయ్యింది. బీఆర్ఎస్ లో అనేక అవకాశాలు పొంది పార్టీ ద్వారా ఎదిగిన దళిత నాయకులంతా పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎంపీ అభ్యర్ధిత్వం కోసం వెతుకులాట ప్రారంభమైంది. పార్టీని వీడిన నేత, ఉద్యమంలోపాల్గొన్న విద్యార్ధి, యువజన, మహిళా నాయకుల పేర్లు పరిశీలిస్తున్నారు.