ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ బీఆరెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించాయి.
విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ బీఆరెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించాయి. బస్సు డిపోల ముందు బీఆరెస్ కార్యకర్తలు బైఠాయించి నిరసనలకు దిగారు. జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రాస్తారోకోలతో నిరసనలు చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మోదీ కేడీ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల బంద్ నిర్వహించారు. పోలీసులు నిరసనలు నిర్వహించిన బీఆరెస్ నాయకులను పలుచోట్ల అదుపులోకి తీసుకుని వదిలేశారు. ఆదిలాబాద్లో వ్యాపార, వాణిస్య సముదాయాలు బంద్ నిర్వహించారు.
కవిత అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ సహా అన్ని జిల్లాల వారిగా బీఆరెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో మాట్లాడిన బీఆరెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కవిత అరెస్టు అక్రమమని, బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతు రాజకీయ దాడులకు పాల్పడుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిందని అగ్రహం వ్యక్తం చేశారు.