Delhi | ఐదు నెలల్లో పలుమార్లు లైంగిక దాడి విషయం తెలిసీ దాచిన ఆయన భార్య ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన ఇద్దరినీ అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడు ప్రేమోదయ్ ప్రభుత్వాధికారి న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ ప్రభుత్వాధికారి.. తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఐదు నెలల వ్యవధిలో ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ క్రమంలో గర్భవతి అయిన బాలికకు అధికారి భార్య మందులు ఇచ్చి.. అబార్షన్ చేయించింది. ఈ విషయం […]
Delhi |
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ ప్రభుత్వాధికారి.. తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఐదు నెలల వ్యవధిలో ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ క్రమంలో గర్భవతి అయిన బాలికకు అధికారి భార్య మందులు ఇచ్చి.. అబార్షన్ చేయించింది.
ఈ విషయం బయటపడకుండా ఇద్దరూ దాచి పెట్టారు. 2020 అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో పదే పదే లైంగికదాడులకు గురైన బాలిక.. తరచూ భయంతో మూర్ఛపోతుంటే తల్లి వెంటనే దవాఖానలో చేర్పించారు. అక్కడ వైద్యులకు ఆమె తనపై జరిగిన లైంగికదాడులు, అబార్షన్ విషయాలను వెల్లడించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడు ప్రేమోదయ్ ఖఖ్ఖా (51), ఆయన భార్య సీమాదేవి (50)ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
వైద్యులు ఆరా తీస్తే.. వెలుగులోకి
తన కూతురు తరచూ పానిక్ ఎటాక్స్కు గురవుతుండటంతో ఆందోళన చెందిన తల్లి.. ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు సైకలాజికల్ థెరపీ నిర్వహించారు. ఈ సమయంలో తనపై జరిగిన ఘోరాన్ని బాలిక వైద్యులకు తెలిపింది. వెంటనే వైద్యులు పోలీసులను అప్రమత్తం చేశారు. ‘బాలిక దవాఖానలో చేరిన వారం తర్వాత.. ఆగస్ట్ 13న కేసు రిజిస్టర్ చేశాం’ అని సీనియర్ పోలీస్ అధికారి సాగర్సింగ్ కల్సీ చెప్పారు.
ఎఫ్ఐఆర్లో ఏమున్నదంటే..
బాలిక తండ్రి, ఖఖ్ఖా స్నేహితులు. 2020లో బాలిక తండ్రి చనిపోయాడు. ఆ బాధలో తల్లి కుమిలి పోతుంటే.. బాలికను తమతో పంపించాలని, కోలుకునే దాకా తాను బాలిక సంరక్షణను తీసుకుంటానని చెప్పిన ప్రేమోదయ్.. ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్లాడు. అక్కడ 2020 అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి మధ్యకాలంలో ప్రేమోదయ్.. పదే పదే లైంగికదాడులు చేశాడు.
అయితే..తాను గర్భం దాల్చినట్టు గుర్తించిన బాలిక.. విషయాన్న అధికారి భార్యకు చెబితే.. ఆమె ఈ విషయం బయట ఎవరికీ చెప్పదంటూ.. మందులు తెచ్చి అబార్షన్ చేయించింది. ఒక సందర్భంలో తన తల్లి అక్కడికి రాగా.. తనకు ఇక్కడ నచ్చడం లేదని, ఇంటికి తీసుకుపోవాలని కోరింది.
దీంతో ఆమె తన బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత తరచూ భయాందోళనలకు గురవుతూ మూర్ఛపోతూ ఉంటే.. దవాఖానకు తీసుకెళ్లారు. అప్పుడు ఈ ఘోరం బయటకు వచ్చింది. బాలిక మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో ఇంకా లేదని పోలీసులు చెబుతున్నారు.
అధికారి సస్పెన్షన్
బాలికపై లైంగిక దాడులకు పాల్పడిన అధికారిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతో విధుల నుంచి తొలగించారు. ఆ అధికారి అత్యంత అమానుష చర్యకు పాల్పడ్డాడని, ఇది సమాజాన్ని కుదిపివేసిందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. ‘అందరికీ కుమార్తెలు ఉంటారు. ఈ చర్య చాలా సిగ్గుచేటు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి’ అని ఆయన అన్నారు.