నర్సంపేటలో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది ప్రతిపక్ష పాలన రాష్ట్రాల్లో పరిహారం ఇవ్వలేదు త్వరలో నర్సంపేటకు సీఎం కేసీఆర్ రాక విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత సంవత్సరం కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెక్కులను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పంపిణీ చేశారు. నర్సంపేటలో […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత సంవత్సరం కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెక్కులను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పంపిణీ చేశారు. నర్సంపేటలో మంగళవారం జరిగిన సమావేశంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వానకు వేల మంది రైతులు నష్టపోయినా కేంద్రం పట్టించుకోక పోవడం దురదృష్టకరమన్నారు. నర్సంపేటలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. బిజెపి, కాంగ్రెస్ వాళ్లు బాగా మాట్లాడుతున్నారు గానీ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలు అక్కడ ఒక్క రూపాయి పంచకుండా ఇక్కడ పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,11,235 ఎకరాల పంటలు… మొత్తం 71 వేల మంది రైతులు నష్టపోయారని ఈ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నారు.
ఇటీవల జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడానికి సీఎం కేసీఆర్ త్వరలో నర్సంపేటకు రానున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రైతులకు అందించాల్సిన నష్టపరిహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో ఇవ్వాలి.. కానీ కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదని, నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు అందించిందన్నారు.
వ్యవసాయ శాఖ కింద మొత్తం 1874 హెక్టార్ల పంట (అన్ని రకాల) నష్టానికి గాను 3712 మంది రైతులకు రూ.1,56,16,302, అదేవిధంగా ఉద్యానవన శాఖ కింద 5265.81 హెక్టార్ల పంట నష్టానికి గాను 12417 మంది రైతులకు రూ. 7,10,88,435 విలువ గల చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు.