Nirmal | సంఘీభావం తెలిపిన బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ను, అలాగే జీఓ 220 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్లు ప్రజలకు వసతులు కల్పించేందుకు […]
Nirmal |
సంఘీభావం తెలిపిన బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ను, అలాగే జీఓ 220 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్లు ప్రజలకు వసతులు కల్పించేందుకు ఉండాలే గానీ అధికార పార్టీ వ్యాపార సాధనంగా ఉండకూడదన్నారు.
సీఎం కేసీఆర్ భూములు అమ్ముకునే బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారని ఈటల విమర్శించారు. జోన్ కన్వర్ట్ చెయ్యడంతో పేదల చేతిలో ఉన్న అసైన్డ్ భూములు లాక్కుని పరిశ్రమల పేరుతో నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. భూప్రక్షాళన, ధరణి తీసుకు వచ్చి వేల ఎకరాల అన్ ఐడెంటిఫీడ్ లాండ్ లను కేసీఆర్ బినామీ పేర్లకు మార్చుకున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల భూ కుంభకోణం చేస్తున్నారని పేర్కొన్నారు.
నిర్మల్ పురాతన పట్టణమని, ఎన్నో ఏళ్ల కిందనే ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించారన్నారు. ఇప్పుడు అక్కడ పరిశ్రమలు మూతపడడంతో ఆ భూములు అమ్ముకోలేరని వారిని భయపెట్టి మంత్రి అనుచరులు అతి తక్కువ ధరకు కొనుగోలుచేశారని, భూములు వారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ గా మార్చారని విమర్శించారు.
గ్రీన్ జోన్ లోనున్న మంజులపూర్, తల్వెద గ్రామాలను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చి మట్టిని నమ్ముకొని బతుకుతున్న రైతుల కళ్ళలో మట్టి కొట్టారన్నారు. రైతుల కళ్లలో మట్టి కొట్టే అధికారం ఎవరు ఇచ్చారన్న ప్రశ్నతో మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు.
గ్రీన్ బెల్ట్, కన్సర్వేషన్ జోన్ లో ఉన్న భూములను కన్వర్ట్ చేసుకొని అధికార పార్టీ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారని ఈటల ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల భూములు లాక్కుంటున్నారని, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువచ్చేది ప్రతిపక్షాలన్నారు.
ప్రజలకు విశ్వాసం కలిగించేది మేమే అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం చక్రవర్తిలాగా, నిజాం సర్కార్ లాగా వ్యవహరిస్తూ నేను యజమానిని, ప్రజలు జీతగాళ్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 5800 ఎకరాలు పేదలకు ఇచ్చిన భూములు కేసీఆర్ లాక్కొన్నాడన్నారు.
ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిందని రోజు వార్తలు వస్తున్నాయని ఈటల విమర్శించారు. ప్రజలు 2023 డిసెంబర్ వరకే మీకు అధికారం అప్పగించారని నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదని నువ్వేం నిజాం సర్కార్ వు కాదని కేసీఆర్పై మండిపడ్డారు. విపక్షాల ప్రజాందోళనలపై ముందస్తు అరెస్టులతో నియంతగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారిస్తుందన్నారు.
నిర్మల్ రైతులకి యావత్ తెలంగాణ అండగా ఉంటుందని నిర్మల్ గడ్డ మీద నుండి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుహాసిని రెడ్డి, పవార్ రామారావు పటేల్, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు ఉన్నారు.