తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ను లాంచ్‌ చేయబోతున్న హీరో హోండా..!

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్నది. దీంతో కంపెనీలన్నీ ఈవీలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా సైతం ఈవీ సెగ్మెంట్‌లోకి వస్తుంది

తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ను లాంచ్‌ చేయబోతున్న హీరో హోండా..!

విధాత‌: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్నది. దీంతో కంపెనీలన్నీ ఈవీలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా సైతం ఈవీ సెగ్మెంట్‌లోకి వస్తుంది. ఇందులో భాగంగా తొలిసారిగా వచ్చే ఏడాది భారత్‌లో 110-125 సీసీ ఈవీ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.


ఎలక్ట్రిక్ బైక్స్ దిశగా ముందుకు వెళ్లేందుకు ఈ బైక్‌ను తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో 2030 నాటికి 3.4 బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి నాలుగు మిలియన్ల ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.


బైక్‌ ఫీచర్స్‌ ఇవే..


హోండా లాంచ్ చేస్తున్న బైక్‌ స్వాప్ చేయగల బ్యాటరీలతో రానున్నది. భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్‌ను మొదట భారత్‌లోని మార్కెట్‌లోకి తీసుకురావాలని.. ఆ తర్వాత ఏషియా మార్కెట్‌, తర్వాత జపాన్‌, యూరప్‌లోనూ లాంచ్‌ చేయాలని హోండా భావిస్తున్నది. 110-125 సీసీ సెగ్మెంట్‌లో రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేయనున్నట్లు హోండా ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. ఇందులో ఒకటి ఈ స్కూటర్‌కు ఫిక్స్‌డ్‌ బ్యాటరీ, మరొక మోడల్‌లో మార్చుకునే అవకాశం ఉన్న బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలిపింది.


ఈవీలపై దృష్టి..


భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లపై దృష్టి సారించనున్నట్లు హోండా ప్రకటించింది. వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందిస్తామని చెప్పింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లకు అవసరమైన యూనిట్లను భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని పేర్కొంది. 2027 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికే ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. ఆ ప్లాంట్ నుంచి 2027 తరువాత సంవత్సరానికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలదని వెల్లడించింది. ప్రత్యేకంగా ఇందుకు రూ.2,800 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించింది.