పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో నిత్యవసర వస్తువులతో పాటు అన్ని రంగాల్లో ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడి్ విమర్శించారు
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్లు
విధాత: పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో నిత్యవసర వస్తువులతో పాటు అన్ని రంగాల్లో ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడి్ విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో నిత్యసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని, 2014లో తులం బంగారం 28 వేలు ఉంటే 2024లో మోడీ నాయకత్వంలో తులం బంగారం రూ.75 వేలకు చేరుకుందని, మహిళలు దీనిపై ఆలోచన చేసి బీజేపీని ఓడించాలన్నారు.
రాముడు లీడర్ కాదని, దేవుడని, దేశాన్ని అప్పుల పాలు చేయమని శ్రీ రాముడు కోరుకున్నాడా? అని ప్రశ్నించారు.. 65 సంవత్సరాల్లో చేసిన అప్పును.. కేవలం 9 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డబుల్ చేశారని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అప్పులను డబుల్ చేయడమా? అని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి ప్రజలను బీజేపీ నేతలు పరేషాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్స్ 15 ఎంపీ సీట్లలో గెలిపించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. దేశానికి ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీకే ఉందన్నారు. రాహుల్ ప్రధాని అయితే అన్ని వస్తువుల ధరలను తగ్గిస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఏపీ ఎన్నికల్లో కొత్త డ్రామా నడుస్తోందని, ఆయా పార్టీల నేతలను రాళ్లతో కొట్టడం ఏందని ప్రశ్నించారు. ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాళ్లతో కొట్టుకునే వ్యవస్థ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో స్వయం పాలన వచ్చిందని, ఏపీ సీఎం మీ దగ్గరే, మీ గల్లీల్లోనే తిరుగుతున్నారన్నారు.