గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న శశిధర్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాలతో భేటీ కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు! మెదక్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి (Sasidhar Reddy) మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారా? గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న శశిధర్రెడ్డి.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో జరిపిన భేటీ ఇందుకోసమేనా? ఇప్పడు జిల్లా రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్గా మారింది. విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక […]
మెదక్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి (Sasidhar Reddy) మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారా? గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న శశిధర్రెడ్డి.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో జరిపిన భేటీ ఇందుకోసమేనా? ఇప్పడు జిల్లా రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్గా మారింది.
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఆయన చెప్పిందే వేదం. ఎంతో మంది నాయకులకు పదవులు ఇప్పించిన ఘనత ఆయనది. రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా గెలిచిన నేటి అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను మెజార్టీ ఉన్నప్పటికీ జడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకొని మెదక్ నియోజకవర్గం టేక్మాల్ జడ్పీటీసీగా గెలిచిన బాలయ్యను జడ్పీ చైర్మన్ను చేసిన ఘనత శశిధర్ రెడ్డిదేనని చెబుతుంటారు.
తన మిత్రుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని డీసీసీబీ చైర్మన్ను చేయడంలో కీలక పాత్ర పోషించిన శశిధర్ రెడ్డి.. సినీనటి విజయశాంతి (Vijayashanthi) కాంగ్రెస్లో చేరడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారమైంది. శశిధర్ రెడ్డిని కాదని 2 సార్లు మెదక్ (Medak) అసెంబ్లీ టికెట్ను అప్పట్లో పార్టీలో ఉన్న సినీ నటి విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించింది.
ఆ ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్రెడ్డి (Padma devender Reddy) చేతిలో ఓడి పోయారు. అయితే.. తన ఓటమికి శశిధర్రెడ్డే బాధ్యుడని పేర్కొంటూ విజయశాంతి పార్టీ అధిష్ఠానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో శశిధర్రెడ్డి కాంగ్రెస్కు దూరమయ్యారు. తదుపరి కాలంలో ఆయన బీజేపీ(BJP)లో చేరారు. అయితే.. విజయశాంతి కూడా బీజేపీలోకి రావడంతో ఆయన అక్కడ ఇమడలేక బీజేపీకి గుడ్బై చెప్పారు.
అప్పట్లో ఈ త్రిమూర్తులదే ఆధిపత్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Rajashekar Reddy) సీఎంగా ఉన్నప్పడు నారాయణ్ఖేడ్కు చెందిన సురేశ్షెట్కార్, మెదక్ నుంచి శశిధర్రెడ్డి, గజ్వేల్కు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి త్రిమూర్తులుగా చెలామణి అవుతూ జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు. మంత్రులుగా దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వీరు చెప్పిందే వేదం అన్నట్టు నడిచింది. వారిలోనూ శశిధర్రెడ్డి కీలకమైన నేతగా ఉండేవారు.
పొన్నాలతో భేటీపై సర్వత్రా ఆసక్తి
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు శశిధర్రెడ్డి తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ఆయన BRS లోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ.. మాజీ మంత్రి పొన్నాల జన్మదినం సందర్భంగా తన పాత మిత్రుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి వెళ్లి పొన్నాలకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జిల్లాలో కొత్త చర్చను రేకెత్తించింది. కాంగ్రెస్లో మళ్లీ చేరే విషయంలో వారి మధ్య చర్చ జరిగినట్టు చెప్తున్నారు.
శశిధర్ రెడ్డి రాకను అడ్డుకుంటున్న నేతలు!
శశిధర్రెడ్డి తన ప్రయత్నాల్లో తాను ఉన్నప్పటికీ.. ఆయన రాకను పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.
సీనియర్ నాయకులైన డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సుప్రభాత్ రావు, మ్యాడం బాలకృష్ణ తదితరులు శశిధర్రెడ్డి రాక పట్ల ఇష్టంతో లేరని సమాచారం. శశిధర్ రెడ్డి కాంగ్రెస్లోకి తిరిగి వస్తే అక్కడ తమ ప్రాభవం తగ్గుతుందనే ఆందోళనలో వారు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తన రాకను వ్యతిరేకిస్తున్న వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. సురేశ్ షెట్కార్, జగ్గారెడ్డితో శశిధర్రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి సమావేశం జరిపినట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చేందుకు శశిధర్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనే అంశంలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి.