కేటాయించిన ఇండ్లను వెంటనే ఇప్పించాలని డిమాండ్
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం గజ్వేల్ స్థానికులు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్ ముందు ఆందోళన చేపట్టారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి టోకెన్ల ద్వారా డ్రా తీశారు. డ్రాలో పేర్లు వచ్చిన వారికి ఇళ్లను కేటాయించారు. కానీ మల్లన్న సాగర్ నిర్వాసితులు గజ్వేల్ స్థానికులకు కేటాయించిన ఇండ్లలో నివాసముంటున్నారు. లబ్దిదారులు వారికి కెటాయించిన ఇండ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలని అడగడంతో మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇండ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని, రావాల్సిన పరిహారం వచ్చేవరకు ఇండ్లను ఖాళీ చేయమని చెప్పారు. దీంతో లబ్దిదారులు ఎర్రవల్లి లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎదుట ధర్నా చేశారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లు వెంటనే ఇప్పించాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులతో మాట్లాడారు. మీ సమస్యను పరిష్కారం కోసం కలక్టరేట్కు వెళ్లాలని సూచించారు. లబ్దిదారుల పేర్లను ఇస్తే కేసీఆర్కు అందజేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.