Heavy Rains విధాత: ఉత్తర భారతదేశాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వరదలు పోటెత్తడంతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 88 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 16 మంది అదృశ్యం కాగా, మరో 100 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. భారీ వర్షాలు, వరదలకు తట్టుకోలేక 492 మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక నిరాశ్రయులకు పునరావాసం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. […]
Heavy Rains
విధాత: ఉత్తర భారతదేశాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వరదలు పోటెత్తడంతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 88 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 16 మంది అదృశ్యం కాగా, మరో 100 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది.
భారీ వర్షాలు, వరదలకు తట్టుకోలేక 492 మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక నిరాశ్రయులకు పునరావాసం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేగాక 170 ఇళ్లు పూర్తిగా, 600 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దాదాపు 450 పశువుల కొట్టాలు కూలిపోయాయి. ఇవాళ సాయంత్రం హిమాచల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించిన నివేదికలో ఈ వివరాలను పొందుపరిచారు.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. 45 ఏండ్ల క్రితం నాటి రికార్డును దాటి, చరిత్రలో తొలిసారి నది నీటిమట్టం ఆల్ టైం గరిష్టానికి చేరింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం 207.55 మీటర్లకు చేరింది. దీంతో ఢిల్లీలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చివరిసారిగా 2013లో నది నీటిమట్టం 207 మీటర్లకు చేరింది. 1978లో యమునా నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరడంతో నాడు ఢిల్లీలో భీకరమైన వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.