High Court | ఏపీ సీఎం జగన్ కంపెనీలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

High Court హైదరాబాద్, విధాత: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ప్రకాశం, గుంటూర్‌ జిల్లాల్లో వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ (వాన్‌పిక్) కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్‌ భూమిని అటాచ్‌మెంట్‌ నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. 11,804.78 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ […]

High Court | ఏపీ సీఎం జగన్ కంపెనీలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

High Court

హైదరాబాద్, విధాత: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ప్రకాశం, గుంటూర్‌ జిల్లాల్లో వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ (వాన్‌పిక్) కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్‌ భూమిని అటాచ్‌మెంట్‌ నుంచి వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది.

ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. 11,804.78 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను, వాటిని అడ్యుడికేటింగ్‌ అథారిటీ సమర్థించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే వాన్‌పిక్‌ భూముల జప్తును కొనసాగిస్తూ, భూముల విడుదల కోసం మనీ లాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్‌పిక్‌కు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ సూచించడం కూడా సరికాదంది.

ఒక వైపు ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమంటూ చెబుతూనే విడుదలకు కిందికోర్టును ఆశ్రయించమని ట్రిబ్యునల్‌ ఎలా సూచిస్తుందని ప్రశ్నించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఇదీ నేపథ్యం…

వాడరేపు నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రకాశం-గుంటూరు జిల్లాల పరిధిలో 13,221.69 ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు విషయంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) దేశాల్లో ఒకటైన రస్‌ అల్‌ ఖైమాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్సస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటయ్యాయి. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను క్విడ్ ప్రో కోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది.

సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధా రంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత వాన్‌పిక్‌కు భూ కేటాయింపులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చారిషీట్ ఆధారంగా వాన్‌పిక్‌కు చెందిన 1.416.91 ఎకరాల భూమిని 2014లో జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వాన్‌పిక్ పోర్ట్స్, వాన్‌పిక్‌ ప్రాజెక్స్.. అప్పీలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.

దీనిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే మరో 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని 2017లో జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 13,221.69 ఎకరాలను పూర్తిగా జప్తు చేసింది. ఈ ఉత్తర్వులను అడ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది.

క్విడ్ ప్రోకో అన్నదే లేదు..

ఈ జప్తుపై కూడా ‘వాన్‌పిక్‌’ కంపెనీలు అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ రెండు జప్తులపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2019, జూలైలో తీర్పు వెలువరించింది. ఈడీ, అడ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా.. రద్దు చేసింది. అయితే భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని ట్రిబ్యునల్ సూచించింది.

హైకోర్టును ఆశ్రయించిన వాన్‌పిక్‌…

భూమి విడుదలకు సంబంధించి అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వాన్‌పిక్‌ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాన్‌పిక్ తరఫున సీనియర్ న్యాయవాది అతుల్ నంద, ఈడీ తరఫున అనిల్‌ ప్రసాద్‌ తివారీ వాదనలు వినిపించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. 561 ఎకరాలు, 855 ఎకరాల జప్తు విషయంలోని రెండు అప్పీళలో గత సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వెంటనే 1,416.91 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే 11,804 ఎకరాల జప్తునకు సంబంధించి మాత్రం కొంత అస్పష్టత ఉండటంతో దీనిపై విచారణను కొనసాగించి.. శుక్రవారం తీర్పునిచ్చింది.