Kamareddy | అప్పుడు మున్సిపల్ మాస్టర్ ప్లాన్… ఇప్పుడు దళిత బంధుకు ప్రజల ఉద్యమం విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముందస్తు ఎన్నికలకు బీఆర్ఎస్ వెళుతోందన్న ప్రజల ఆలోచనకు ఆపార్టీ అధిష్టానం షాకిచ్చింది. ముందస్తు ఎన్నికలను వదిలి, ముందస్తుగా పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేడి రగులుకుంది. పలు ఆరోపణలు ఎదుర్కొన్న స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు టికెట్టు రాకపోగా, కామారెడ్డికి తనకు […]
Kamareddy |
విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముందస్తు ఎన్నికలకు బీఆర్ఎస్ వెళుతోందన్న ప్రజల ఆలోచనకు ఆపార్టీ అధిష్టానం షాకిచ్చింది. ముందస్తు ఎన్నికలను వదిలి, ముందస్తుగా పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేడి రగులుకుంది.
పలు ఆరోపణలు ఎదుర్కొన్న స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు టికెట్టు రాకపోగా, కామారెడ్డికి తనకు తాను ప్రకటించుకుని కేసీఆర్ రాజకీయ సంచలనం సృష్టించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి రెండు నియోజకవర్గాలలో బరిలో నిలిచి పోటీ చేస్తారని బీఆర్ఎస్ ప్రకటన వెలువడింది. దీంతో ప్రతిపక్షాల చూపు అంతా కూడా కామారెడ్డి, గజ్వేల్ పై కేంద్రీకృతమయ్యాయి.
‘దళిత బంధు’ కోసం రోడ్లెక్కి..
ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ కు దీటుగా తమ అభ్యర్థులను బరిలోకి దింపే పనిలో నిమగ్నమయ్యాయి. సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోతే ఇతర పార్టీలకు వెళ్లి, బరిలో ఉంటారని ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ సమాచారం అందింది. స్వపక్షానికే విపక్షంగా మారతారన్న బెంగతో ముందస్తు ఆలోచనతో సిటింగ్ లకే దాదాపుగా సీట్లు అన్నీ కేటాయించారు.
కేవలం ఐదారు నియోజకవర్గాల్లో మాత్రమే పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో తమ పేర్లు ఉండటంతో ఎగిరి గంతేశారు.
ర్యాలీలు, సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, సన్మానాలు నిర్వహిస్తున్నారు. గెలుపు సంగతి దేవుడెరుగు.. వీళ్ళు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. సందట్లో సడేమియా అన్నట్లు అందరూ దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలన్న చందంగా చోటామోటా నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ చేరి పోయారు.
ఈ నేపథ్యంలో తమ గ్రామాల్లోని అర్హులైన వారికి దళిత బంధు పథకం మంజూరు కాలేదని కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట్ మండలాల్లోని పలు గ్రామాల్లో దళితులు, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపై బైఠాయించారు. ఉన్నట్టుండి ఈ హఠాత్పరిణామాలతో కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ రగడ మొదలైంది.
మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గి..
ఇటీవల కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రచ్చకెక్కింది. ఈప్లాన్ మేరకు నిర్మించాలనుకున్న రోడ్ల వల్ల పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. రాజకీయ నాయకుల భూములను కాపాడుకోవడం కోసం అసలు మాస్టర్ ప్లాన్ ను మార్చారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి పొలాల మీదుగా కాకుండా రైతుల పొలాల మీదుగా మళ్లించాలని చూసిన నాయకుల మీద అన్నదాతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కామారెడ్డిలో రెండు నెలలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేశారు.
దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేసుకుంది. అసలే అపఖ్యాతి మూట కట్టుకున్న బీఆర్ఎస్ ఇటీవల జరిగిన ‘దళిత బంధు’ ఆందోళనలతో సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. రైతుల ఆందోళనలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిపక్షాలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ ప్రకటన తర్వాత అక్కడి రాజకీయం వేడెక్కింది.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాకు వచ్చారు. జనగామ, దోమకొండ, పాల్వంచ గ్రామస్తులు ఆయనకి సంఘీభావం ప్రకటించారు.కేసీఆర్ పోటీ చేసినా మా మద్దతు షబ్బీర్ అలీకే అంటూ మూడు గ్రామాల ప్రజలు మద్దతు తెలపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ పాట్లు కొనితెచ్చుకుంటోంది. విజయావకాశాలను దెబ్బతీసుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.