Yatras | విద్వేష యాత్రలు! అల్ల‌ర్ల‌కు దారితీస్తున్న హిందుత్వ ర్యాలీలు

Yatras క‌త్తులు, త్రిశూలాలు, క‌ర్ర‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌ర‌మ‌త వ్య‌తిరేక నినాదాలు, డీజే పాట‌లు సోషల్‌మీడియాలోనూ విద్వేష‌ కంటెంట్ వ్యాప్తి హర్యానాలోని నుహ్‌లో అల్లర్లకు కార‌ణ‌మైన‌ బ్రజమండల్ యాత్ర ఇందుకు నిద‌ర్శ‌నం విధాత‌: ప్ర‌తి స‌మూహానికి కొన్ని మ‌త విశ్వాసాలు ఉంటాయి. మ‌న‌ది లౌకిక దేశం. మ‌న మ‌తాన్ని ప్రేమించ‌డం, పర‌మ‌తాన్ని గౌర‌వించ‌డం క‌నీస ధ‌ర్మం. రాజ్యాంగ‌ సూత్రం కూడా. కానీ, ఇటీవ‌ల కొన్ని హిందుత్వ యాత్రలు విద్వేష యాత్ర‌లుగా మారుతున్నాయి. ప‌ర‌మ‌త పౌరుల‌ను రెచ్చ‌గొడుతున్నాయి. అల్ల‌ర్లకు దారితీస్తున్నాయి. […]

Yatras | విద్వేష యాత్రలు! అల్ల‌ర్ల‌కు దారితీస్తున్న హిందుత్వ ర్యాలీలు

Yatras

  • క‌త్తులు, త్రిశూలాలు, క‌ర్ర‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు
  • ప‌ర‌మ‌త వ్య‌తిరేక నినాదాలు, డీజే పాట‌లు
  • సోషల్‌మీడియాలోనూ విద్వేష‌ కంటెంట్ వ్యాప్తి
  • హర్యానాలోని నుహ్‌లో అల్లర్లకు కార‌ణ‌మైన‌
  • బ్రజమండల్ యాత్ర ఇందుకు నిద‌ర్శ‌నం

విధాత‌: ప్ర‌తి స‌మూహానికి కొన్ని మ‌త విశ్వాసాలు ఉంటాయి. మ‌న‌ది లౌకిక దేశం. మ‌న మ‌తాన్ని ప్రేమించ‌డం, పర‌మ‌తాన్ని గౌర‌వించ‌డం క‌నీస ధ‌ర్మం. రాజ్యాంగ‌ సూత్రం కూడా. కానీ, ఇటీవ‌ల కొన్ని హిందుత్వ యాత్రలు విద్వేష యాత్ర‌లుగా మారుతున్నాయి. ప‌ర‌మ‌త పౌరుల‌ను రెచ్చ‌గొడుతున్నాయి. అల్ల‌ర్లకు దారితీస్తున్నాయి. హింసాకాండ‌ను ప్రేరేపిస్తున్నాయి. మ‌త విశ్వాస యాత్ర‌లు కాస్త విద్వేష యాత్ర‌లుగా మారుతున్నాయి.

స‌మాజంలోని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నార్ద‌కంలో ప‌డేస్తున్నాయి. రాజ్యాంగం క‌ల్పించిన జీవించే హ‌క్కునే కాల‌రాస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణే హర్యానాలోని నుహ్‌లో అల్లర్లకు దారితీసిన బ్రజమండల్ బాలాభిషేక్ యాత్ర. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ యాత్ర‌లో చెల‌రేగిన అల్ల‌ర్లు, హింసాకాండ‌ గుర్గావ్, ఢిల్లీ వ‌రకు వ్యాపించిన సంగ‌తి తెలిసిందే.

శబరిమల యాత్రలు శాంతియుతం

పురాత‌న కాలం నుంచే వివిధ మతపరమైన సందర్భాలలో ‘హిందుత్వ’ గ్రూపులు యాత్రలు నిర్వహిస్తున్నాయి. హిందూ భక్తుల మతపరమైన కార్యకలాపాల్లో యాత్ర‌లు ఒక భాగం. అమర్‌నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర, పూరీ రథయాత్ర, శబరిమల యాత్ర వంటివి ప్రసిద్ధం. ఇవి భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తాయి. నిండు మ‌న‌సుతో మ‌త విశ్వాసంతో, ఎంతో నిష్ట‌తో వివిధ ర‌కాల మాల‌లు వేస్తారు. యాత్ర‌లు చేస్తారు. మత విశ్వాసాల ఆధారంగా జీవితాన్ని గ‌డుపుతారు.

కానీ, కొన్నేండ్లు హిందూత్వంతో ముడిపడి ఉన్న మతతత్వ శక్తుల ప్రమేయం కారణంగా, రామ నవమి, హనుమాన్ జయంతి, ఇత‌ర‌ సందర్భాల్లో మతపరమైన ఊరేగింపులు అల్ల‌ర్ల‌కు, హింసకు దారితీస్తున్నాయి. గ‌తంలో బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ ర‌థ‌యాత్ర బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌కు దారితీసింది. వంద‌ల ప్రాణాలు, కోట్ల ఆస్తి బుగ్గిపాలు కావ‌డానికి కార‌ణ‌మైంది. తాజా హర్యానాలోని నుహ్‌లో వీహెచ్పీ యాత్రకు కూడా అల్లర్లకు ఆజ్యం పోసింది. రెండువ‌ర్గాల మ‌ధ్య అగ్గి రాజేసింది.

మారిన యాత్ర‌ల స్వ‌రూపం

మతపరమైన ఊరేగింపుల స్వ‌రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయుధాలు ధ‌రించ‌డం సాధార‌ణంగా మారింది. రామనవమి, హనుమాన్ జయంతి ర్యాలీల సంద‌ర్భంగా గ‌తంలో గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్ మినహా అనేక రాష్ట్రాల్లో ఆయా సంద‌ర్భాల్లో అల్ల‌ర్లు చెల‌రేగాయి.

కాషాయ దుస్తులు ధరించిన పురుషులు కత్తులు, త్రిశూలాలు, తుపాకీల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన‌డం ఇప్పుడు క‌నిపిస్తున్న‌ది. వీరు మైనార్టీలు, ఇత‌రుల ప్రార్థ‌నా మందిరాలు ఉన్న మార్గాల గుండా ర్యాలీలు నిర్వ‌హిస్తారు. మ‌త వ్య‌తిరేక పాట‌ల‌ను డీజేలో మోగిస్తూ, ప‌ర‌మ‌త వ్య‌తిరేక నినాదాలు చేస్తారు. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌తారు. రెచ్చ‌గొట్టే నినాదాల‌కు అవ‌త‌లి వ‌ర్గం నుంచి ఏమాత్రం స్పంద‌న వ‌చ్చినా దుకాణాలు, ఇళ్లపై దాడి చేయ‌డానికి సిద్దంగా ఉంటారు. హ‌ర్యానాలోని నుహ్ సరిగ్గా ఇలాంటి ప‌ద్ధ‌తినే అనుస‌రించిన‌ట్టు తెలుస్తున్న‌ది.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌త హింస మ‌రింత పెరిగే ప్ర‌మాదం

హిందూత్వ శక్తుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగే మత ప్ర‌ద‌ర్శ‌న స్వ‌రూపం పూర్తిగా మారుతున్న‌ది. హిందూ భ‌క్తులు అనుస‌రించే భక్తి, విశ్వాసం స్థానంలో ద్వేషం, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం వంటి జాఢ్యాలు ఎజెండా మారుతున్నాయి. ఒక వ‌ర్గాన్ని ల‌క్ష్యంగా చేసుకొని యాత్ర‌లు సాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది నుహ్ త‌ర‌హా విద్వేష యాత్రలు మరింత పెరిగే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది. ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా మత సామరస్యంతో యాత్రలు నిర్వ‌హించుకోవ‌డం మంచింది. ఒకరినొకరు ద్వేషించుకోకుండా సామరస్యంతో జీవించడానికి అనువుగా మ‌త యాత్రలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుపుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది.