Jupally Krishnarao కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని జోస్యం విధాత: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జూపల్లితో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, […]
Jupally Krishnarao
కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని జోస్యం
విధాత: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జూపల్లితో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ ముఖ్, అన్న కిష్టప్ప, నారాయణ రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్రావు ఠాక్రే, ఎంపీ ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనపై విరుచక పడ్డారు. వందలాది మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో దోపడికి గురవుతుందన్నారు. కేసీఆర్ వంటి రాక్షస మనస్తత్వం , అహంకారపూరిత వ్యక్తి ఎక్కడా లేరన్నారు. తొమ్మిదేళల్లో ఒక్కసారి కూడా సచివాలయం వెళ్లనీ సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడేనన్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ పేరుతో మళ్లీ జనాన్ని మోసం చేస్తున్నాడన్నారు. రైతు రుణమాఫీకి డబ్బుల కోసం మూడు నెలల ముందే వైన్స్ టెంటర్లు వేస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమ సమక్షంలో లక్షకు గతిలేని కేసీఆర్కు నేడు లక్షల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు పెడుతానంటు అహంకారంగా మాట్లాడుతున్నారని జూపల్లి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేఎసీఆర్ ఎన్ని డ్రామాలు వేసిన జనం నమ్మరని ఈ దఫా కాంగ్రెస్దే అధికారమన్నారు. కర్ణాటకలో అవినీతి బీజేపీని ఓడించినట్లుగా తెలంగాణలో అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాట్లాడుతు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ హామీలు, పోరాటాలకు తలొగ్గి ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ ప్రకటించారన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ విజయమేనని, కాంగ్రెస్ బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామంటే కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పదవీ కాలం చివరి దశలో మూడు నెలల ముందు వైన్స్ టెండర్లు వేయడంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన అధ్యయనం చేస్తుందన్నారు.