ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుం భారత ప్రభుత్వానికి వరుస బెదిరింపులు జారీ చేస్తున్నాడు
విధాత: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుం భారత ప్రభుత్వానికి వరుస బెదిరింపులు జారీ చేస్తున్నాడు. ఈ నెల13న కానీ ఆ లోపు కానీ పార్లమెంటు (Indian Parliament) ను పేల్చేస్తానని మంగళవారం విడుదల చేసిన వీడియలో పేర్కొన్నాడు. 2001లో డిసెంబరు 13నే పార్లమెంటుపై అఫ్జల్ గురు బృందం బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే.
అందుకే గురుపత్వంత్ ఆ తేదీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు విడుదల చేసిన వీడియోలో కూడా అఫ్జల్ గురు చిత్రం కూడా కనపడుతోంది. పన్నుంను తుదముట్టించడానికి భారత నిఘా అధికారులు ప్రణాళిక వేశారనే వాదన బయటకు వచ్చిన తర్వాత అతడు వీడియో విడుదల చేయడం ఇదే తొలిసారి.
దిల్లీని ఖలిస్థాన్ కింద మార్చేస్తానని.. తాను తీసుకునే చర్య భారత పార్లమెంటు భవనాన్ని కుదిపేస్తుందని పన్నుం హెచ్చరించాడు. డిసెంబరు 13న నా స్పందన 2001లో అఫ్జల్ గురు చేసిన దానికి కాస్త విరుద్ధంగా ఉంటుంది. పార్లమెంటు పునాదులే కదిలిపోతాయి అని పన్నుం తన వీడియోలో బెదిరించాడు.
ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఇవి ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో పన్నుం నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దిల్లలోనూ, పార్లమెంటు చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు.
ఏ చిన్న అసాంఘిక చర్యనైనా అడ్డుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమ దేశ పౌరసత్వం ఉన్న పన్నుంను హత్య చేయడానికి భారత్కు చెందిన ఒక వ్యక్తిని అమెరికా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
న్యూయార్క్లో నివసిస్తున్న ఒక అమెరికా పౌరుణ్ని చంపడానికి భారత ప్రభుత్వ అధికారి.. ఇప్పుడు పట్టుబడిన నిందితుడితో సహా చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలను అసలు సహించడం అని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది.