Love | తన ప్రేమ పెళ్లికి అడ్డు రావొద్దనే ఉద్దేశంతో ఓ యువతి తన తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మధ తాలుకాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మధకు చెందిన మహేంద్ర షా.. స్థానికంగా పేరుమోసిన వ్యాపారవేత్త. ఆయనకు కుమార్తె సాక్షి ఉంది. ఆమె చైతన్య అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే తమ పెళ్లికి తండ్రి అడ్డు రావొద్దని.. మహేంద్రను […]
Love | తన ప్రేమ పెళ్లికి అడ్డు రావొద్దనే ఉద్దేశంతో ఓ యువతి తన తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మధ తాలుకాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మధకు చెందిన మహేంద్ర షా.. స్థానికంగా పేరుమోసిన వ్యాపారవేత్త. ఆయనకు కుమార్తె సాక్షి ఉంది. ఆమె చైతన్య అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలోనే తమ పెళ్లికి తండ్రి అడ్డు రావొద్దని.. మహేంద్రను చితక్కొట్టించి, కాళ్లు విరగొట్టించారు. ఇందుకు నలుగురు వ్యక్తులకు రూ. 60 వేల సుపారీ ఇచ్చారు. ఇక పథకంలో భాగంగా పుణెకు వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్సు దిగిన ఆమె.. అక్కడికి రావాలని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
దీంతో సాక్షిని కారులో ఇంటికి తీసుకెళ్తుండగా.. వాడచివాడి గ్రామ సమీపంలో మూత్రం వస్తోందని చెప్పి కుమార్తె కారు దిగింది. కారును అనుసరించిన నలుగురు వ్యక్తులు.. మహేంద్రపై దాడి చేసి కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచి పారిపోయారు.
మహేంద్ర అరుపులు విన్న ఓ ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుని, మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి కుమార్తెను ప్రధాన నిందితురాలిగా తేల్చారు. ఈ ఘటనలో ఆమె ప్రియుడి పాత్ర ఉందని నిర్ధారించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.