Site icon vidhaatha

Margadarsi | మార్గదర్శిపై.. హైకోర్టులో పిటిషన్

Margadarsi |

విచారణను జులై 20కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్, విధాత: మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాంటి కుంభకోణం ఇప్పటివరకు జరగలేదు.. ఇకపై జరగబోదని తెలంగాణ హైకోర్టులో ఏపీ సర్కార్‌ వాదనలు వినిపించింది. ‘మార్గదర్శి’కి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని వెల్లడించింది.

మార్గదర్శి కేసు దర్యాప్తు వివరాలను సీఐడీ అధికారులు మీడియాకు వెల్లడిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెరుకూరి రామోజీరావు, శైలజతో పాటు మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రై. లిమిటెడ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ గోవిందరెడ్డి వాదనలు వినిపించారు. మార్గదర్శి అక్రమ మార్గాలకు తరలించిన సొమ్మంతా ఖాతాదారులదేనన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించిన కొన్ని వివరాలు వారికి తెలియాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఈ రకమైన ఓ కుంభకోణం జరగడం ఇదే తొలిసారని చెప్పారు.

ఇదే విజ్ఞప్తిపై గతంలోనూ ఇదే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, అప్పుడు పిటిషనర్‌కు అనుకూలంగా ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ పిటిషన్‌ను కూడా కొట్టివేయాలని కోరారు. అసలు మార్గదర్శి వేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపే అర్హత ఈ కోర్టుకు ఉందా.. అన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నదని చెప్పారు.

ఈ పిటిషన్‌ జూలై 18న విచారణకు రానుందని, అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

Exit mobile version