దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల నిర్వాహణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కలుషిత ఆహారాలు..ఆత్మహత్యల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు
ప్రభుత్వానికి హరీశ్రావు డిమాండ్
విధాత: దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల నిర్వాహణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కలుషిత ఆహారాలు..ఆత్మహత్యల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై హరీశ్రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి రావడం దారుణమన్నారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.