హరిత విప్లవం పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత

విధాత భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ (97) గురువారం కన్నుమూశారు. ప్రస్తుతం చెన్నైలో కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. ఒకానొక దశలో అల్పాదాయాలతో కునారిల్లుతున్న భారత వ్యవసాయానికి స్వామినాథన్ (M.S. Swaminathan) ఊపిరిలూదారు.
అధిక ఉత్పత్తులనిచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టించడం ద్వారా రైతుల ఆదాయాలు పెరగడానికి తీవ్ర కృషి చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగానే కాక, వృక్ష జన్యు పరిశోధకుడిగా, మానవతావాదిగా అనేక ప్రసిద్ధి చెందారు. ఆయన సేవలకు గుర్తుగా 1987లో అత్యున్నతదమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను అందుకున్నారు.
అనంతరం చెన్నైలోనే ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ను పెట్టి పరిశోధనలు కొనసాగించారు. రామన్ మెగసెసె అవార్డు (1971), ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు (1986) వంటి పురస్కారాలూ ఆయనను వరించాయి. భారతదేశంలో సాగు అనే అంశం ఎక్కడ వచ్చినా వెంటనే వచ్చే పేరుగా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆయనకు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మథుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు.