ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంచాయితీ పై నాగార్జున సాగర్ డ్యాం వద్ధ చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది
విధాత: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంచాయితీ పై నాగార్జున సాగర్ డ్యాం వద్ధ చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశం నిర్ణయాలను త్వరలోనే విడుదల చేస్తామని సీడబ్ల్యుసీ చైర్మన్ వోహ్రా తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతో పాటు వాటి పరిధిలోని అనుబంధ ఉమ్మడి నిర్మాణ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పర్యవేక్షణలో కేంద్ర బలగాల పరిధిలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించినట్లుగా సమాచారం.
కాగా.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కృష్ణా నది ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారాన్ని చర్చించారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్లు, ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హజరయ్యారు. సీడబ్ల్యుసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు నేరుగా పాల్గొన్నారు.
కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు, నాగార్జునసాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం నిర్వహణ బదిలీ అంశం, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. గత మూడు రోజులుగా నాగార్జున సాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వివాద పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
6న మరోసారి కేంద్ర జలశక్తి శాఖ సమావేశం
సాగర్, శ్రీశైలం నిర్వాహణలపై చర్చ
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వాహణపై మరోసారి చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహిస్తామని కార్యదర్శి ముఖర్జీ తెలిపారు. శనివారం నిర్వహించి జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్లో తెలుగు రాష్ట్రాలలోని కృష్ణా నది పరిధిలో ఉమ్మడి నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించామని, మరింత విస్తృత చర్చల కోసం ఈనెల 6వ తేదీని వర్చువల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అప్పటిదాకా రెండు రాష్ట్రలు సంయమనం పాటించాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల పోటాపోటీ కేసులు
నాగార్జున సాగర్ డ్యాంపై తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో ఏపీ, తెలంగాణ పోలీసులు పోటాపోటీగా పరస్పరం ఒకరిపై మరొకరు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సాగర్ డ్యాంపైకి అక్రమంగా చొరబడి తమపై దాడి చేసి తమ విధులను ఆటంకపరిచి దౌర్జన్యంగా కుడి కాలువకు నీటి విడుదల చేశారన్న ఫిర్యాదుపై ముందుగా సాగర్ పోలీస్ స్టేషన్లో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది.
తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, డ్యాం ఎస్పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ప్రతిగా సాగర్ డ్యాంపై తమ విధులను అడ్డుకున్నారని ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్వాహణ హక్కులపై రేగిన తాజా వివాదంలో రెండు రాష్ట్రాల పోలీసులు పరస్పరం పోటాపోటీగా కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.